నిరుద్యోగ భృతిపై ప్రతిపాదనలు సిధ్దం చేసిన ఎపి ప్రభుత్వం...శనివారం శాసన సభ లో చర్చించే అవకాశం..
అమరావతి: టిడిపి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం చదువుకున్న నిరుద్యోగ యువకులకు జీవన భృతి ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం అయినట్లు తెలిసింది. ఈ అంశంపై చర్చించేందుకు బుధవారం మంత్రి యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర,నారా లోకేష్ తో పాటు ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు, యువజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో నిరుద్యోగ భృతి విధివిధానాలపై సుదీర్ఘ కసరత్తు జరిగినట్లు తెలిసింది. నిరుద్యోగులకు నెలకు రెండు వేలు జీవన భృతి ఇవ్వాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇక నిరుద్యోగుల విద్యార్హతగా టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీలలో ఏది ప్రాతిపదికగా తీసుకోవాలన్నఅంశంపై మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, పీజీ చదివిన వారికి ఎక్కువ, డిగ్రీ చదివిన వారికి తక్కువ భృతి అంటే విమర్శలు వచ్చే అవకాశాలున్నాయని చర్చ జరిగిందట. అందువల్ల ఇంటర్ను నిరుద్యోగభృతికి కనీస అర్హతగా నిర్ణయించాలని ప్రాథమికంగా తీర్మానించినట్లు తెలిసింది. నిరుద్యోగ భృతిపై సుదీర్ఘ చర్చ అనంతరం మంత్రివర్గ బృందం సిద్దం చేసిన ప్రతిపాదనలు ఇవేనని తెలిసింది.

కనీస విద్యార్హత ఇంటర్మీడియెట్.
ఒక్కొక్కరికి నెలకు రూ.2000 చొప్పున నిరుద్యోగ భృతి.
ఇంటర్మీడియెట్పైన ఎంత విద్యార్హత ఉన్నప్పటికీ అందరికీ ఒకేలా రూ.2000 చొప్పునే ఇవ్వాలని నిర్ణయం.
నిరుద్యోగ భృతి ఎవరు అనర్హులు అనే విషయం పై మంత్రి వర్గం ప్రతిపాదనలు సిద్దం చేసింది.
ఒక కుటుంబంలో ఒక్కరికే నిరుద్యోగ భృతి.
తెల్ల రేషన్కార్డు, ఆధార్కార్డు, ఓటరు గుర్తింపుకార్డు తప్పనిసరి
మాగాణి భూమి అయితే రెండున్నర ఎకరాల లోపు, మెట్ట భూమి అయితే ఐదు ఎకరాల లోపు ఉన్నవారే అర్హులు.
సొంత కారు ఉన్నవాళ్లు అర్హులు కాదు.
నిరుద్యోగ భృతి తీసుకుంటున్నవారిలో సామాజిక స్పృహను పెంచేందుకు స్వచ్ఛభారత్, వనం-మనం వంటి నాలుగైదు ప్రభుత్వ కార్యక్రమాల అమలు బాధ్యతను అప్పగిస్తారు.
నిరుద్యోగ భృతికి అర్హులు 8 లక్షల మంది నుంచి 10 లక్షల మంది వరకు ఉంటారని అంచనా.
ఉన్నత విద్యాభ్యాసం చేసి నిరుద్యోగులుగా ఉన్నవారికి నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో శిక్షణనిచ్చి, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తారు. దానికయ్యే ఖర్చుని ప్రభుత్వం భరిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన రూ.500 కోట్లు, నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం నుంచి వస్తున్ననిధులు, వివిధ ఉపప్రణాళికల ద్వారా ఖర్చు చేస్తున్న నిధులు వంటివన్నీసమీకృతంచేసి ఈపథకాన్ని అమలు చేస్తారు.
వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, విభాగాల ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద రాయితీలు పొందిన వారు నిరుద్యోగ భృతికి అనర్హులు.
ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ భృతికి ధరఖాస్తు చేసుకునేందుకు ఒక వెబ్సైట్ను ప్రారంభిస్తారు.
ప్రతి సంవత్సరం ఏటా ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే నిరుద్యోగులుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఏడాది పొడవునా నమోదు ప్రక్రియ ఉండదు.
నిరుద్యోగి తన ఆధార్ కార్డునెంబరు నమోదు చేసి అతడిని నిరుద్యోగభృతి కింద అర్హుడిగా గుర్తించారా లేదా? గుర్తించకపోతే ఎందుకు అనే కారణాలను కూడా అందులో చూపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అర్హుడిగా గుర్తించకపోవడానికి పోర్టల్లో చూపిన కారణాలు సరైనవి కావని సంబందిత వ్యక్తి భావిస్తే 1100కి ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం 1100లో ప్రత్యేకంగా నిరుద్యోగభృతి ప్రజావిజ్ఞప్తుల విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. విభాగం ఈ ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపడం ద్వారా వాటి పరిష్కారానికి సమన్వయం చేస్తుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు ఇలా వేర్వేరు శాఖలు, సంస్థల ద్వారా నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణనిప్పిస్తున్నారు. ఇకమీదట వీటన్నింటినీ ఒకతాటి మీదకు తీసుకువచ్చి ఒకే రకమౌన శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు.
డిసెంబర్ 2 న శాసన సభ ముందుకు...
నిరుద్యోగ భృతిపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారట. తదనంతరం డిసెంబర్ 2 న శాసనసభలో ఈ అంశంపై చర్చ జరిపే అవకాశం ఉంది. ఆ సందర్భంలోనే పథకం అమలుపై ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.












Click it and Unblock the Notifications