అర్ధరాత్రి ఉత్తర్వులు... రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ పునర్నియామకం..
ఇటీవలి హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం(జూలై 30) అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఒక ప్రకటన జారీ చేశారు.ఈ మేరకు గెజిట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. అయితే స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీం ఇచ్చే తీర్పుకు లోబడే పదవీ పునర్నియామకం ఉంటుందని స్పష్టం చేసింది.
ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ పదవీ కాలం కుదింపు, కొత్త కమిషనర్గా జస్టిస్ కనగరాజును నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. తిరిగి రమేష్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ సుప్రీం కోర్టు తిరస్కరించింది.
Recommended Video
మరోవైపు హైకోర్టు తీర్పును అమలుచేయట్లేదంటూ నిమ్మగడ్డ కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే దీనిపై స్టే ఇవ్వాలంటూ జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించగా మరోసారి చుక్కెదురైంది. స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. ఏపీ హైకోర్టులో జరగబోయే పరిణామాలపై తదుపరి అఫిడవిట్ దాఖలు చేస్తామని నిమ్మగడ్డ తరఫు లాయర్ కోరగా, అందుకు సుప్రీంకోర్టు వారం రోజులు గడువిచ్చింది. ఇంతలోనే ఏపీ ప్రభుత్వం ఎస్ఈసీగా రమేష్ కుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.