ఆ నిధులు వినియోగించండి: దక్షిణాది రాష్ట్రాలకు ఎన్జీటీ కీలక ఆదేశాలు
వాయు కాలుష్య నివారణ నిధుల సక్రమ వినియోగంలో వైఫల్యంపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దక్షిణ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సరిగా వాడకపోతే పర్యావరణ పరిహారం రూపంలో జరిమానాలు తప్పవని స్పష్టం చేసింది. చెన్నైలోని ఎన్జీటీ సౌత్ జోన్ బెంచ్.. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళతో పాటు పుదుచ్చేరిని కూడా జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్సీఏపీ) కింద రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలను సకాలంలో అమలు చేయాలని ఆదేశించింది.
కర్ణాటకలో నిధుల వినియోగ లోపాలను ట్రిబ్యునల్ గుర్తించింది. 2019-20 నుండి 2023-24 వరకు ఎన్సిఏపి కింద రాష్ట్రానికి రూ. 597.54 కోట్లు లభించాయి. ఇందులో బెంగళూరు వాటా రూ. 541.1 కోట్లు. అయితే, 2024 అక్టోబర్ నాటికి కేవలం 13 శాతం నిధులు మాత్రమే వినియోగించారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ అఫిడవిట్ ప్రకారం.. 2025-26 వరకు విడుదలైన నిధులలో 76 శాతం సెప్టెంబర్ 2025 నాటికి వినియోగించినట్లు నివేదించినా వ్యయం తీరుపై ట్రిబ్యునల్ అసంతృప్తిని వ్యక్తం చేసింది.
NGT నిధుల కేటాయింపులో అసమానతలను ప్రస్తావించింది: కేటాయించిన నిధుల్లో 86 శాతం పైగా రోడ్డు ధూళి నియంత్రణకు, 6.6 శాతం వాహనాల ఉద్గారాలకు, 4.1 శాతం బయోమాస్ దహనానికి వెచ్చించారు. కాలుష్య ప్రాథమిక వనరులను మెరుగ్గా పరిష్కరించేలా ఖర్చులను హేతుబద్ధీకరించి, ప్రణాళికాబద్ధంగా వాడాలని బెంచ్ సూచించింది. నిరంతర అసమర్థతను సహించబోమని ట్రిబ్యునల్ హెచ్చరించింది. నిధులు సక్రమంగా వినియోగించకుండా మిగిలిపోతే లేదా అసమర్థంగా వాడితే రాష్ట్రాలు, పట్టణ స్థానిక సంస్థలపై పర్యావరణ పరిహారం విధిస్తామని తెలిపింది.
ముఖ్యంగా, కర్ణాటక, బెంగళూరు సహా దాని పట్టణ అథారిటీలు, ఎన్సీఏపీ, ఆర్థిక కమిషన్ గ్రాంట్ల కింద కేటాయించిన నిధులను నిర్దిష్ట కాలంలో పూర్తిస్థాయిలో, సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆదేశించింది. ఈ తీర్పు దక్షిణ భారత వాయు కాలుష్య సమస్యపై కొత్త దృష్టిని ఆకర్షిస్తుంది. దిల్లీ ఎన్సీఆర్ వంటి ఉత్తర ప్రాంతాల ఆందోళనల నీడలో ఉన్న ఈ అంశం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ట్రిబ్యునల్ ముందు సమర్పించిన అంచనాల ప్రకారం, దక్షిణ భారతంలోని అనేక నగరాల్లో PM2.5, PM10 స్థాయిలు జాతీయ ప్రమాణాలను మించి, WHO మార్గదర్శకాలకు నాలుగు నుండి ఆరు రెట్లు అధికంగా ఉన్నాయి. ఏలూరు, కళబుర్గి, హైదరాబాద్, విశాఖపట్నం వంటివి కాలుష్య హాట్ స్పాట్ లుగా కొనసాగుతున్నాయి.

మెరుగైన ప్రణాళిక, సమతుల్య వ్యయం, సకాలంలో అమలు లేకపోతే, దక్షిణ భారతదేశంలో వాయు నాణ్యత ప్రజారోగ్యానికి తీవ్ర ఆందోళనగా మిగిలిపోతుందని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించాలని సూచించింది.












Click it and Unblock the Notifications