90 నియోజకవర్గాల్లో సరికొత్త డిజిటల్ రైతుబజార్లు..
ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల రూపురేఖలను మార్చేలా కూటమి ప్రభుత్వం సరికొత్త విప్లవాత్మక వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగ ఆధునీకరణ, మార్కెటింగ్ నెట్వర్క్ బలోపేతం, మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ శాఖలు, ప్రాథమిక రంగాల మిషన్లపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం పలు సంచలన ప్రకటనలు చేశారు. 90 నియోజకవర్గాల్లో కొత్త రైతుబజార్ల ఏర్పాటు, 'ఫార్మ్ టు హోమ్' విధానం, ఆక్వా రంగానికి భారీ విద్యుత్ రాయితీలు, మత్స్యకారులకు రూ.240 కోట్లతో మరపడవలు లాంటి చారిత్రాత్మక నిర్ణయాలకు ఈ భేటీలో ఆమోదం లభించింది.
'ఫార్మ్ టు హోమ్'.. నేరుగా ఇళ్లకే వ్యవసాయ ఉత్పత్తులు
రైతులు పండించిన కూరగాయలు, పండ్లను దళారుల ప్రమేయం లేకుండా, తక్కువ వ్యయంతో నేరుగా వినియోగదారుల ఇళ్లకే చేర్చేలా 'ఫార్మ్ టు హోమ్' (Farm to Home) అనే సరికొత్త విధానాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ల (FPOs) ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దీనితో పాటు రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో కొత్తగా అత్యాధునిక రైతుబజార్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఉన్న రైతుబజార్లను పూర్తిగా ఆధునికీకరించి, 'డిజి రైతుబజార్ యాప్'ను విస్తృతం చేయాలని స్పష్టం చేశారు. రైతుబజార్లు, ప్రైవేటు మార్కెట్లలో 'ప్రకృతి సేద్యం' (Natural Farming) ఉత్పత్తుల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
ఆక్వా రంగానికి రూ.1,100 కోట్ల బూస్టింగ్.. మత్స్యకారులకు మరపడవలు
ఆక్వా రంగాన్ని 'బ్లూ ఎకానమీ'గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ సబ్సిడీలను ప్రకటించింది. ప్రస్తుతం ఆక్వా రంగానికి యూనిట్కు రూ.1.50 చొప్పున ఇస్తున్న విద్యుత్ సబ్సిడీని.. ఇప్పటికే ఉన్న 50 వేల కనెక్షన్లతో పాటు కొత్తగా నమోదైన 12,680 కనెక్షన్లకు కూడా వర్తింపజేయాలని సీఎం ఆదేశించారు. దీనికోసం ప్రభుత్వం అదనంగా రూ.188 కోట్లు భరిస్తూ.. మొత్తంగా రూ.1,100 కోట్ల విద్యుత్ రాయితీ భారాన్ని మోయనుంది. రాష్ట్రంలో సాగవుతున్న 4 లక్షల ఎకరాలను పూర్తిగా ఆక్వా జోన్ పరిధిలోకి తేవాలని సీఎం స్పష్టం చేశారు. సముద్ర తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధిని పెంచేందుకు రూ.240 కోట్ల వ్యయంతో 200 మెకనైజ్డ్ (మర) బోట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్.. కోకో సిటీ స్థాపన
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్'కు జూలైలో శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. అలాగే, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యడవోలు సమీపంలో చాక్లెట్ల తయారీకి ముడిసరుకైన కోకో సాగును ప్రోత్సహించేలా 'కోకో సిటీ' (Coco City) ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో పెండింగ్లో ఉన్న 'సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ' పనుల నిమిత్తం రూ.3 కోట్లను తక్షణమే విడుదల చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశించారు.
రాయలసీమకు రూ.40 వేల కోట్లతో 'పూర్వోదయ'.. కోల్డ్ స్టోరేజీలు
రాయలసీమ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద ఉద్యానవన (హార్టికల్చర్) హబ్గా మార్చేందుకు రూ.40 వేల కోట్లతో 'పూర్వోదయ' పథకాన్ని అమలు చేయనున్నారు. దీని ద్వారా సాగునీటి ప్రాజెక్టులు, రవాణా సౌకర్యాలు, గోదాముల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రూ.60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులను కూడా ఆకర్షించనున్నారు. ముఖ్యంగా రాయలసీమలో పండే అరటి పంట రక్షణ కోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలను కల్పించనున్నారు.
ఎల్ నినో ముప్పు.. ప్రకృతి సేద్యమే శరణ్యం!
ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధాల ప్రభావం వల్ల రసాయన ఎరువుల లభ్యత తగ్గిపోయే ప్రమాదం ఉందని సీఎం హెచ్చరించారు. దీనికి తోడు 'ఎల్ నినో' ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి రసాయన ఎరువుల వాడకం తగ్గించి, ప్రకృతి సేద్యాన్ని, సూక్ష్మపోషకాల (మైక్రో న్యూట్రియెంట్స్) వినియోగాన్ని పెంచాలన్నారు. భూసార పరీక్షలు నిర్వహించి, ఏ నేలలో ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో ఆ వివరాలను ఆన్లైన్ ద్వారా రైతులకు ముందే తెలియజేయాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, విద్యార్థులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రకృతి సేద్యంపై అధ్యయనం చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. 'ఫార్మర్ యాప్' ద్వారా డ్రోన్లు, హార్వెస్టర్లు, ఆధునిక వ్యవసాయ యంత్రాలను రైతులకు అద్దెకు ఇచ్చే సిస్టమ్ తీసుకురావాలని సీఎం దిశానిర్దేశం చేశారు.














Click it and Unblock the Notifications