రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం - పూజలు, ప్రత్యేకతలు, షెడ్యూల్..!!
ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక ప్రకటన చేసింది. శబరిమల అయ్యప్ప ఆలయం రేపు తెరుచుకోనుంది. చింగం మాసం పూజల కోసం ఈ ఆలయాన్ని తెరుస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. సాయంత్రం ఐదు గంటలకు ఆలయ ప్రధాని పూజారి ఆలయ తలుపులను తెరుస్తారు. తరువాత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 17వ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి భక్తులకు దర్శనం అవకాశం కల్పించనున్నారు.
ప్రసిద్ధి చెందిన శబరిమల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం ఆదివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకు తెరుచుకోనుంది. మలయాళ కేలండర్ ప్రకారం వచ్చే 'చింగం' మాస పూజా కార్యక్రమాల కోసం ఈ ఆలయాన్ని తెరవనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 17న మలయాళ నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ పవిత్ర దినం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచే భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ చింగం మాస పూజలన్నీ ముగిసిన తర్వాత, ఆగస్టు 21వ తేదీ రాత్రి 10 గంటలకు ఆలయ గర్భగుడిని మూసివేయనున్నారు. చింగం మాస పూజల ముగింపు అనంతరం, రాబోయే ఓనం పండుగ ప్రత్యేక పూజల నిమిత్తం ఆగస్టు 24వ తేదీన శబరిమల ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు.

ఆలయ అధికారుల సూచనలు
ఈ ప్రత్యేక సందర్భంలో ఆలయానికి విచ్చేసే అయ్యప్ప భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీడీబీ అధికారులు మరియు కేఎస్ఆర్టీసీ (KSRTC) సిబ్బంది తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. రద్దీకి తగినట్లుగా ప్రత్యేక బస్సు సర్వీసులు మరియు ఇతర సౌకర్యాలను కల్పిస్తూ యాత్రికులకు మెరుగైన సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. ఆలయం ప్రారంభం తో పాటుగా పూజా కార్యక్రమాలు.. తిరిగి 21న ఆలయ గర్భగుడిని మూసివేసే సమయం గురించి పూర్తి సమాచారం దేవస్థానం అందుబాటులో ఉంచింది. ఆలయ అధికారులు తీసుకున్న తాజా నిర్ణయాల మేరకు భక్తులు తమ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ సమయంలో భక్తుల సంఖ్య పైన అంచనా ఉందని.. అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.













Click it and Unblock the Notifications