'ధురంధర్' గా మారి.. పాకిస్థాన్ ఆర్మీని లేపేసేందుకు.. బెంగళూరు కుర్రాడి మాస్టర్ ప్లాన్.. కానీ..!
పాకిస్థాన్ కు ఎప్పుడూ భారత్ పై దాడులు చేయాలనే ఉంటుంది. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా యుద్ధాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారత్ పై అనేకసార్లు పాకిస్థాన్ లోని ఉగ్రమూకలు దాడులకు పాల్పడ్డాయి. అయితే ప్రతిసారీ భారత్.. ఆ దేశ దాడులను తీవ్రంగా తిప్పికొడుతూ వస్తోంది. గతేడాది పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 25 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాంతో వెంటనే పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రస్థావరాలపై దాడులకు పాల్పడింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది.
ఇక పాకిస్థాన్ ను చూస్తే ప్రతి భారతీయుడి మదిలో కోపం, ఆక్రోశం, పగ తీర్చుకోవాలనంత కసి కనిపిస్తాయి. పాకిస్థాన్ చేసే కుట్రలకు ఆ దేశాన్ని నాశనం చేయాలని ప్రతి భారతీయుడు ఆలోచన చేస్తాడు. అయితే బెంగళూరులోని బొమ్మసంద్ర ఇండస్ట్రీయల్ ఏరియాలోని పాతికేళ్ల సెక్యూరిటీ గార్డు అసాఫుల్ మాలిక్.. పెద్ద ప్లానే వేశాడు. 'ధురంధర్' మూవీ పథకం వేశాడు. పాకిస్థాన్ వెళ్లి ఏకంగా అక్కడి ఆర్మీనే లేపేయాలని ప్లాన్ వేశాడు. కానీ చివరకు అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటనపై కొందరు నెటిజన్లు నిజమైన దేశభక్తి అని చెబుతుండగా.. మరికొందరు మాత్రం ఇలాంటి ఘటనలు తీవ్రమైనవని మాట్లాడుకుంటున్నారు.
హెబ్బగోడి పోలీస్ స్టేషన్, ఎలక్ట్రిక్ సిటీ డివిజన్ అందించిన సమాచారం ప్రకారం.. అసాఫుల్ మాలిక్ తండ్రి పేరు అబేద్ మాలిక్.. బెంగళూరులోని జిగాని ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతను వెస్ట్ బెంగాల్ లోని 24 నార్త్ పరాగణా జిల్లాకు చెందినవాడు. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ లోని మసీదులు, సాధారణ ప్రజల మధ్య జరుగుతున్న ఘటనలు చూసి ఆవేదన చెందిన అతను పాకిస్థాన్ ఆర్మీని అంతం చేయాలని భావించాడు. అంతేకాక ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదంలో పాకిస్థాన్ ఆర్మీ ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేయడంపైనా అతడు కోపంతో ఉన్నట్లు తేలిందని హెబ్బగోడి పోలీసులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్థాన్(TTP) కు చెందిన ఇమ్రాన్ అహిందర్ అనే ఉగ్రవాదితో పరిచయం పెంచుకున్నట్లు విచారణలో తేలింది. అతడు అఫ్గానిస్తాన్ కు చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్ ను అంతం చేయాలన్న కసితో ఆ సంస్థతో చేతులు కలిపినట్లు తేలింది. అంతేకాక అహిందర్ తో కలిసి అసాఫుల్ మాలిక్ అఫ్గానిస్తాన్ వెళ్లి వీసా కోసం దరఖాస్తు చేయాలని భావించాడు. కానీ అనేక కారణాలతో జర్నీని నిలిపివేసినట్లు విచారణలో పేర్కొన్నారు. దర్యాప్తు అధికారులు ఇప్పటికే అసాఫుల్ మాలిక్ మొబైల్ నుంచి మెసేజ్ లు రికవరీ చేసినట్లు.. ఆడియా రికార్డింగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ ఆర్మీపై రివెంజ్ తోనే ఈ పన్నాగం పన్నినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై హెబ్బగొండి పోలీస్ స్టేషన్ లో బీఎన్ఎస్ సెక్షన్ 113 కింద కేసు నమోదు చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది.












Click it and Unblock the Notifications