తెలంగాణ వదిలించుకుంది: ఏపీ పట్టం కట్టింది: సలహాదారుడి పదవి ఇచ్చిన సీఎం జగన్..!
తెలంగాణ ప్రభుత్వం ఆయన వద్దనుకున్నారు. ఆయన్ను తెలంగాణ ప్రభుత్వం వద్దనుకుంది. ఏపీ ప్రభుత్వం ఆయన కావాలన్నది. ఏకంగా ప్రభుత్వ సలహాదారుడి పదవి కట్టబెట్టింది. ఇతర సలహాదారుల మాదిరి అన్ని రకాల జీత భత్యాలను కేటాయించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏపీలోనే కాదు తెలంగాణలోనూ చర్చకు కారణమైంది. తనకు ప్రాధాన్యత లేని పోస్టు ఇచ్చారనే ఆవేదనతో అప్పట్లో స్వచ్చంద పదవీ విరమణ చేసిన మాజీ ఐఏయస్ అధికారి ఆకునూరి మురళీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వ సలహాదారుడయ్యారు. ఐఏయస్ పదవికి రాజీనామా చేసి అప్పుడు సంచలనంగా మారిన మురళీ వ్యవహారం..ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఏకంగా కీలక పోస్టు దక్కించుకొని మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణ వద్దనుకున్న ఈ అధికారికి ఏపీ ముఖ్యమంత్రి ఇంత ప్రాధాన్యత కలిగిన పోస్టు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది...జగన్ ఆలోచన ఏంటి..
జగన్ గారూ! ఆటో డ్రైవర్లు భయపడుతున్నారు తెలుసా?: లోకేష్ సెటైర్లు
వివాదాస్పద వ్యాఖ్యలతో బదిలీ..
ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కొన్ని వర్గాల ఐఏఎస్లకు ప్రాధాన్య పోస్టులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వాస్తవమేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరి కొన్ని వ్యాఖ్యల కారణంగా ప్రభుత్వం ఆయన్ను తెలంగాణ స్టేట్ ఆర్కీవ్స్ కార్యదర్శిగా ప్రాధాన్యత లేని పోస్టులో నియమించింది. ఆ తరువాత ఆయన ప్రభుత్వం ఐఏయస్ అధికారుల పై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఓపెన్ గా వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వం నిర్ణయం మార్చుకోలేదు. ఫలితంగా ఆయన తన ఉద్యోగానికి స్వచ్చంద పదవీ విరమణకు నిర్ణయం తీసుకున్నారు. ఇక సర్వీసులో ఉండరాదని డిసైడ్ అయ్యారు.
పదవీ విరమణ చేస్తూ..మురళీ ఇలా..
మరో పది నెలల పదవీ కాలం ఉండగానే ఆకునూరి మురళి జూలై 27న స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేయగా.. సెప్టెంబర్ 16న తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఆ సమయంలో దేశంలోని చాలా రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ అధ్వాన్నంగా ఉందన్నారు. తెలంగాణలో కూడా స్కూళ్లలో మౌలిక వసతులు సరిగ్గా లేవని మురళీ తెలిపారు. కాగా, కలెక్టర్గా మురళీ మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. ఏ అంశమైనా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతారనేది ఆయన గురించి అధికార వర్గాలు చెబుతూ ఉంటాయి. అయితే, ఆయనకు ప్రాధాన్యత లేని పోస్టు ఇవ్వటమే కారణమా..లేక ప్రభుత్వంతో ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయం మాత్రం స్పష్టత రాలేదు. సరిగ్గా ఇదే సమయంలో ఆయనకు ఏపీలో మరో పోస్టు దక్కింది.
సలహాదారుడి పదవి ఇచ్చిన జగన్..
తమ ప్రభుత్వ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మురళీ వీఆర్ యస్ తీసుకున్న వెంటనే ఆమోదించి..తెలంగాణ ప్రభుత్వం వదిలించుకుంది. ఆయనకు తాజాగా ఏపీ ప్రభుత్వం ఆకునూరి మురళీకి ఏపీ పాఠశాల విద్య (మౌళిక వసతుల కల్పిన ) సలహాదారుడిగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర సలహాదారుల మాదిరిగానే ఆయనకు రెండు లక్షల జీతం.. ఇతర అలవెన్సులతో కలిసి 1.82 లక్షలు అందనున్నాయి. అయితే..తెలంగాణ ప్రభుత్వ వద్దు అనుకున్న అధికారిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు.. అందునా ఏకంగా సలహాదారుడి పదవి ఇచ్చారనే అంశం పైన చర్చ సాగుతోంది.