ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం - భారం, మార్గదర్శకాలు..!!
ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుందా. ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఏపీలో ఎన్నికల వేళ అధికార - ప్రతిపక్షాలు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమమే తనకు అధికారం నిలబెడుతుందనే నమ్మకంతో ఉన్నారు. టీడీపీ కొత్త సంక్షేమ పథకాలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పైన నిర్ణయం దిశగా కసరత్తు జరుగుతోంది.
మహిళలకు ఉచిత ప్రయాణం
ఏపీలో ఎన్నికల వేళ ప్రతిపక్షాలు ఏ అవకాశం ఇవ్వకూడదనేది సీఎం జగన్ ఆలోచన. కర్ణాటక, తెలంగాణలో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఆదరణ బాగుంది. దీనిని ఏపీలోనూ అమలు దిశగా వైసీపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కార్యాలయంలో పనిచేసే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటు రవాణా శాఖ కీలక అధికారి ఆర్టీసీ హౌస్కు వచ్చి ఎండీ ద్వారకా తిరుమలరావుతో భేటీ అయ్యారు.

ఆర్టీసీకి ఉన్న సమస్యలతో పాటు ఆర్థిక పరిస్థితులపై ఆరా తీసారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఆర్టీసీ ఎండీతోనూ మాట్లాడినట్లు సమాచారం. తెలంగాణలో మహిళలకు ఉచి బస్సు ప్రయాణం అమలు ద్వారా ఎలాంటి స్పందన ఉంది..ఆర్దికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆరా తీసినట్లు తెలుస్తోంది.
అధికారుల కసరత్తు
తెలంగాణలో ఆర్టీసీ పైన ఈ పధకం అమలు ద్వారా రోజుకు దాదాపుగా రూ 4 కోట్ల మేర ఆదాయం తగ్గినట్లు చెప్పారని సమాచారం. ఇదే సమయంలో మహిళలకు బస్సుల కేటాయింపు..ఇతర ప్రయాణీకులకు ఎదురవుతున్న సమస్యల పైనా ఆరా తీసారు. పురుషులకు తమకు బస్సుల్లోకి ఎక్కేందుకు అవకాశం దక్కటం లేదని వాపోతున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అదే విధంగా ఆటో డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక..ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి ఖరారు చేసిన కేటగిరీలపైన చర్చ సాగుతోంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పధకం అమలు చేయటం ద్వారా లాభంతో పాటుగా ఏ వర్గం నుంచి వ్యతిరేకత లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆర్టీసీ - ప్రభుత్వవం పైన పడే ఆర్దిక భారం పరిగణలోకి తీసుకుంటున్నారు.
అమలు దిశగా అడుగులు
ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిలో అన్ని రకాల పాస్ లు కలిగిన వారు 10 లక్షల మంది ఉంటారు. ఇందులో 3-4 లక్షల మంది విద్యార్ధినులు, మహిళలు ఉంటారు. ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారి ద్వారా ఆర్టీసీకి సగటున రూ 17 కోట్ల వరకు రాబడి వస్తోంది.ఒక వేళ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తే నిత్యం రూ 6 కోట్ల వరకు ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వివరాలన్నీ నివేదిక రూపంలో సిద్దం చేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే జనవరి 1న సీఎం జగన్ ప్రకటన చేసి..సంక్రాంతి కానుకగా మహిళలకు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications