కొత్త ఇళ్ల పై ప్రభుత్వం గుడ్ న్యూస్- అర్హుల జాబితా సిద్దం, పంపిణీ ఇలా..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇళ్ల పంపిణీ పై కార్యాచరణ సిద్దం అయింది. స్పష్టమైన కాల పరిమితిని సీఎం చంద్రబాబు ఖరారు చేసారు. అర్హుల జాబితాల పైన కసరత్తు జరుగుతోంది. ప్రతీ మూడు నెలలకోసారి సామూ హిక గృహప్రవేశాలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే ఉగాదికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అప్పగించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇదే సమయంలో ఇళ్ల యూనిట్ ధరను రూ.1.20 లక్షల నుంచి రూ.2.39 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసారు.
ఐదేళ్లలో అందరికీ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ పేదలకు శాశ్వత గృహ వసతి కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (పీఎంఏవై-రూరల్) 2.0 పథకం కింద పేదలకు మంజూరు చేసే ఇళ్ల యూనిట్ ధరను రూ.1.20 లక్షల నుంచి రూ.2.39 లక్షలకు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వు లు విడుదల చేశారు. పీఎంఏవో గ్రామీణ్ 2.0 పథకం కింద పేదలకు మంజూరు చేసే ఇళ్లకు కేంద్ర వాటా రాయితీ కింద రూ.72 వేలు(60 శాతం), రాష్ట్ర ప్రభుత్వ వాటా రాయితీ రూ.48 వేలు(40 శాతం)... కలిపి మొత్తం రూ.1.20 లక్షలు, జీ రామ్ జీ కింద 90 రోజుల పని దినాలకు కన్వర్జెన్స్ రూపంలో రూ.27వేలు, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కింద రూ.12 వేలు, ఎస్హెచ్జీ లోన్పై వడ్డీ రాయితీ రూ.80 వేలు కలిపి... మొత్తం రూ.2.39 లక్షలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

ప్రభుత్వం ప్రణాళిలకు అమలు దిశగా
కాగా, పేదలకు ఇళ్ల పంపిణీ పైన సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. వచ్చే మూడేళ్లల్లో 17 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఇళ్ల లబ్ధిదారుల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని తేల్చిచెప్పారు. ఇప్పటి నుంచే లక్ష్యాలు పెట్టుకుని హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం గుర్తించిన లబ్ధిదారులే కాకుండా ఇంకా అర్హులైన వారిని గుర్తించి చేర్చేందుకు చేస్తున్న సర్వేను త్వరగా పూర్తి చేసి జాబితా సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఆ జాబితాను గ్రామాల వారీగా ప్రదర్శించాలని చెప్పారు. ప్రజలు తృప్తి చెందితేనే తనకు సంతృప్తి అని వెల్లడించారు.
తాజా నిర్ణయం అమలు విషయంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications