ధాన్యం కొనుగోళ్లపై ఏపీ సర్కార్ కీలక ఆదేశం..! రైతులకు పండగే..!
ఏపీలో ఈసారి ఖరీఫ్ రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఈ మేరకు పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో విమర్శలు రాకుండా అధికారుల్ని సమన్వయం చేస్తూ పలు ఆదేశాలు ఇస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ పౌరసరఫరాల కార్పోరేషన్ ఆధ్వర్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో సదస్సు నిర్వహించారు. ఇందులో వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు మిల్లర్లకు హెచ్చరికలూ చేశారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగాలని పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ సూచించారు. గత ఏడాది ధాన్యం కొనుగోలు సమయంలో క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలను ఈ ఏడాది ముందస్తు ప్రణాళికలతో పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా గన్ని బ్యాగులు, లేబర్, ట్రాన్స్పోర్ట్ వంటి సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గన్ని బ్యాగ్స్ సరఫరాలో దళారులను అరికట్టడానికి జేసీలు చొరవ తీసుకోవాలని, దీనికి సంబంధించి జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక SOP విడుదల చేస్తుందన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తామని, ప్రతి అంశం డాష్బోర్డులో అందుబాటులో ఉంటుందని మంత్రి మనోహర్ చెప్పారు. పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన అధికారులు పిలుపునిచ్చారు. గత ఏడాది అకాల వర్షాల కారణంగా 30,000 టార్పాలను పంపిణీ చేసినట్లు గుర్తు చేస్తూ, ఈసారి కూడా అవసరాన్ని బట్టి ముందస్తుగా టార్పాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

గత ప్రభుత్వంలో రైతులు ధాన్యం విక్రయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం "ఫార్మర్ ఫ్రెండ్లీ" విధానాల ద్వారా రైతులకు స్వేచ్ఛను కల్పించిందన్నారు. రైతులు తమకు నచ్చిన మిల్లుకు, నచ్చిన సమయంలో ధాన్యం విక్రయించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. రైతులు సులభంగా వాట్సాప్లో "HI" పంపడం ద్వారా ధాన్యం విక్రయ ప్రక్రియలో చేరే సౌకర్యాన్ని కల్పించామని, విక్రయించిన 24 నుండి 48 గంటలలోపే రైతు ఖాతాల్లో నగదు జమ చేసిన విషయాలను గుర్తు చేశారు. మరోవైపు రేషన్ బియ్యం రీసైక్లింగ్కు వ్యతిరేకంగా రైస్ మిల్లర్లు ఇచ్చిన హామీని అమలు చేయాలని అధికారులను మంత్రి తెలిపారు. ఈ అంశాన్ని అగ్రిమెంట్లలో స్పష్టంగా పొందుపరచాలని ఆదేశించారు. FCI కు 60 రోజుల్లో బియ్యం సరఫరా చేసే రైస్ మిల్లులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.












Click it and Unblock the Notifications