వారికి ఉచితంగా వాహనాలు, ప్రభుత్వ నిర్ణయం - మార్గదర్శకాలు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. పాలనతో పాటుగా సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అందులో భాగంగా పెన్షన్ల పెంపు.. ఉచిత గ్యాస్ అమలు చేస్తున్న కూటమి సర్కార్.. జనవరిలో కొత్త నిర్ణయాల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇదే క్రమంలో మరో నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు వంద శాతం రాయితీ త్రిచక్ర వాహనాలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు ఖరారు చేసారు.
దివ్యాంగుల కోసం
ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల కోసం తాజా నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు పూర్తి రాయితీలో రెట్రోఫిటెడ్ తిచక్ర వాహనాలను అందించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఆర్దికశాఖ ఈ మేరకు ఒట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ నుంచి నిధులు మంజూరు చేయనుంది. ఆ వెంటనే దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలోనే నియోజకవర్గంలో పది మంది చొప్పున 1,750 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందించాలని లక్ష్యంగా ఖరారు చేసారు.

అర్హతలు
దివ్యాంగులకు ఇవ్వనున్న త్రిచక్ర వాహనాల ఖరీదు ఒక్కొక్కటి రూ లక్ష వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇందు కోసం రూ 17.50 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసారు. ప్రతీ ఏటా ఇదే విధంగా అర్హులైన దివ్యాంగులకు అన్ని నియోజకవర్గాల్లోనూ పంపిణీ చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. గతంలో వైసీపీ హయాంలోనూ ఈ పథకం అమలు అయినా.. అయిదేళ్లు పూర్తిగా కొనసాగించలేదు. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా పలువురు దివ్యాంగులు తిరిగి ఈ పథకం పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతీ ఏటా ఈ పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక, ఇప్పుడు ఆర్దిక శాఖ ఆమోదంతో వీటి కొనుగోలు కు సంబంధించిన టెండర్లు ఆహ్వానించనున్నారు.
మార్గదర్శకాలు
తొలి ఏడాది 1,750 మందికి ఈ త్రిచక్ర వాహనాలను అందించనున్నారు. అదే విధంగా ఈ పథకానికి అర్హతలు ఖరారు చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసారు. డిగ్రీ, ఆ పైన చదువుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తోంది. అదే విధంగా ఏడాది కాలానికి పైబడి స్వయం ఉపాధి రంగంలో ఉన్న వారికి ఈ పథకం అమలులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. 70 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి వీటిని అందించాలని డిసైడ్ అయ్యారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారికి పంపిణీ చేయనున్నారు. అదే విధంగా రూ 3 లక్షల ఆదాయ పరిమితి ఖరారు చేసారు. వీటికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది.












Click it and Unblock the Notifications