ఏపీలో కానిస్టేబుళ్ల పోస్టింగ్స్, ప్రమోషన్లపై హోంమంత్రి గుడ్ న్యూస్..!
ఏపీలో చాలా పెండింగ్ లో ఉన్న కొత్త కానిస్టేబుళ్ల నియామకాలు, ప్రమోషన్లు, కొత్త బెటాలియన్ల ఏర్పాటుపై హోంమంత్రి వంగలపూడి అనిత తాజాగా అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో ఆమె క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ ఉద్యోగాలు, ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఊరట దక్కినట్లయింది.
రాష్ట్రంలో మొత్తం 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ ఉన్నాయని హోంమంత్రి అనిత వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 16,862 కానిస్టేబుల్ పోస్టుల్లో 6,100 పోస్టుల నియామకం పూర్తి కాబోతుందన్నారు. మిగిలిన 10,762 ఖాళీల నియామకానికి సంబంధించి ప్రభుత్వానికి, డీజీపీకి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు ఆమె తెలిపారు. అనుమతులు రాగానే మిగిలిన పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు చేపడతామని హోంమంత్రి అనిత వెల్లడించారు. కానిస్టేబుల్ ఖాళీల నియామకానికి అన్ని పరీక్షలు పూర్తయ్యాయన్నారు. కేవలం మెయిన్స్ మిగిలిందన్నారు. దీనిపై వివాదం కోర్టులో ఉందన్నారు. అఫిడవిట్ దాఖలు చేసి 45 రోజుల్లో కానిస్టేబుళ్లను ట్రైనింగ్ కు పంపిస్తామన్నారు.

అలాగే పోలీస్ ఇన్స్ పెక్టర్ల ప్రమోషన్లపై బీజేపీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు అడిగిన మరో ప్రశ్నకు కూడా హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు. డీఎస్పీ పదోన్నతులు ఇవ్వకపోవడానికి కారణం హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సీనియారిటీ జాబితాను సవరించడమేనని స్పష్టం చేశారు. 2017లో హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2018లో సీనియారిటీ జాబితాను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. ఇచ్చిన సీనియారిటీ లిస్టులో 1995కు చెందిన డీఎస్పీ వెంకటేశ్వర్లు.. సీనియారిటీని నిర్ణయించాలని హైకోర్టును ఆశ్రయించినట్లు గుర్తుచేశారు.
ఈ పోస్టులకు సంబంధించిన వివాదం కోర్టులో ఉండడం వల్ల ప్రమోషన్లకు ఇబ్బందిగా మారిందని హోంమంత్రి తెలిపారు. సీనియారిటీ లిస్టును పక్కన పెట్టాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో కొంతమంది డీఎస్పీలుగా ప్రమోట్ అయి మళ్లీ సీఐలుగా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వాళ్ల కోసం సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి ప్రమోషన్లు కల్పించామన్నారు. దానివల్ల సీఐ, ఎస్సై పోస్టుల్లో ఖాళీలు ఏర్పడినట్లు తెలిపారు. తెలంగాణలో న్యాయ సమస్యలు లేకపోవడం వల్లే ప్రమోషన్లు జరిగాయన్నారు.
కొత్త పోస్టులు కల్పిస్తే ఏడాదికి ఒక్కొక్కరి వల్ల ప్రభుత్వానికి రూ.11,75,325 ఆర్థిక భారం పడుతుందన్నారు. ఏడాదికి ప్రభుత్వంపై మొత్తం రూ.101,31,30,150(రూ.100కోట్లు) భారం పడుతుందన్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా కూడా సాంకేతిక అడ్డంకులను తొలగించి ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్నారు.

ఇప్పటివరకు 862 మంది పోలీస్ ఇన్ స్పెక్టర్లు (సివిల్) 6 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసినట్లు వివరించారు. 1995 బ్యాచ్ కు చెందిన 65 మంది ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. కానీ వారు కోర్టును ఆశ్రయించడం వల్ల ప్రక్రియ ఆలస్యమైందన్నారు. త్వరలోనే కోర్టు అనుమతితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. కమిటీ ద్వారా చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హోంమంత్రి తెలిపారు.
అలాగే రాష్ట్రంలో నాలుగు కొత్త బెటాలియన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 13 వేల మంది పోలీసులకి శిక్షణ ఇచ్చే అవకాశం ఉండేదని, రాష్ట్ర విభజన తర్వాత 6 వేల మందికి మాత్రమే శిక్షణ ఇచ్చే అవకాశం ఉందన్నారు. ట్రైబల్ బెటాలియన్ కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు హోంమంత్రి పేర్కొన్నారు. నాలుగు కొత్త ఏఆర్ బెటాలియన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications