మమ్మల్నీ మోసం చేశావ్.. ఆ హామిల మాటేది?: బాబుపై భగ్గుమన్న జర్నలిస్టులు
అమరావతి: గత ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామిలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాత్రికేయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
హామిలు ఏమయ్యాయి?:
కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించిన జర్నలిస్టులు.. ఏపీయూడబ్య్లూజే ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జర్నలిస్టులకు అనేక హామిలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారని వారు ఆరోపించారు.
మమ్మల్నీ మోసం చేశారు..:
హామిల విషయంలో చంద్రబాబు ప్రజలను ఎలా మోసం చేశారో జర్నలిస్టులనూ అలాగే మోసం చేశారని విమర్శించారు. ఇచ్చిన హామిల ప్రకారం.. ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు, అక్రిడేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
నంద్యాలలో జరిగిన ఆందోళనలో జర్నలిస్టులు మాట్లాడుతూ.. తమ పిల్లలకు విద్యా సంస్థల్లో 60శాతం రాయితీ, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.200కోట్లను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
చిత్తూరులో ధర్నా:
మరో ఏడాదిలో ఎన్నికలు దగ్గరపడుతున్నా.. ఇంతవరకు ఇచ్చిన హామిలను నెరవేర్చలేకపోయారని చంద్రబాబుపై చిత్తూరు జర్నలిస్టులు మండిపడ్డారు. జర్నలిస్టులకు సంక్షేమ నిధి, అక్రిడేషన్, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆర్డీవో కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.
కడప కలెక్టరేట్ ముందు ధర్నా:
కడపలోనూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఏపీయూడబ్ల్యుజే ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. జర్నలిస్టులకి ఇచ్చిన హామీలు మూడు పడక గదుల ఇళ్లు, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ బాబురావుకు వినతి పత్రం అందజేశారు.