ఏపిలో టిఆర్ఎస్ శాఖ: కెసిఆర్కు ఏపి న్యాయవాది లేఖ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి శాఖను ప్రారంభించాలని గుంటూరుకు చెందిన న్యాయవాది రామస్వామి రెడ్డి ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. 60ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కెసిఆర్ సాకారం చేశారని రామస్వామి రెడ్డి తన లేఖలో అభినందించారు.
టిఆర్ఎస్ పాలన అద్భుతంగా ఉందని, సామాజిక న్యాయం కోసం కెసిఆర్ ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలు రాజ్యాంగం పేర్కొన్న సంక్షేమ రాజ్య సాధనకు దోహదపడతాయని చెప్పారు.
నిరుపేద ఎస్సీ కుటుంబాలకు 3 ఎకరాల భూమి పంపిణీ, ముస్లింలు, ఎస్సీలకు రిజర్వేషన్లు విప్లవాత్మకమైన నిర్ణయాలని న్యాయవాది రామస్వామి తన లేఖలో పేర్కొన్నారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ బీసీలకు ప్రాతినిథ్యం కల్పించడం హర్షనీయమని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దేశానికే ఆదర్శం కావాలని రామస్వామి కోరారు. కెసిఆర్ అడుగుజాడల్లో నడిచేందుకు ఆంధ్రప్రదేశ్లో కూడా టిఆర్ఎస్ పార్టీ శాఖను ఏర్పాటు చేయాలని న్యాయవాది రామస్వామి తన లేఖలో కోరారు.