హైద్రాబాద్ నుంచి తరిమేయడానికి హరీష్ ఎవరు: కేఈ, నెహ్రూ వార్నింగ్
హైదరాబాద్/కర్నూలు: హైదరాబాద్ నుంచి ఆంధ్రులను తరిమేయడానికి మంత్రి హరీష్ రావు ఎవరని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం నాడు ధ్వజమెత్తారు. ఆర్డీఎస్ ఎత్తు పెంచితే రాయలసీమ ఎడారి అవుతుందన్నారు.
మరో ఇరవై ఏళ్లైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేరని చెప్పారు. ఏపీలో చంద్రబాబు సమర్థవంతంగా పాలిస్తున్నారని చెప్పారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. హోదాపై ప్రతిపక్షాలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయన్నారు.
హరీష్ రావుకు దేవినేని వార్నింగ్!
తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఏపీ సీఎం చంద్రబాబులపై కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ సోమవారం విమర్శలు గుప్పించారు. ఎగువన ఉన్న తెలంగాణ మనకు దిగువకు వచ్చే నీరును పాలమూరు, డిండి ప్రాజెక్టుల ద్వారా తోడుకుంటోందన్నారు. అయినా చంద్రబాబు మాట్లాడటం లేదన్నారు.
ఎడారైన మన ప్రాంతాలు దాదాపు అరవై లక్షల ఎకరాలు రాబోయే కాలంలో రాజస్థాన్ మాదిరిగా ఎడారిలా మారే పరిస్థితి వస్తుందన్నారు. ఇంత జరుగుతున్నా ఏపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదన్నారు. ఒక్కసారి ఆలోచించండి హరీష్ రావు.. ధర్నా చేసేవాళ్లకు హెచ్చరికలు ఇవ్వడం సరికాదన్నారు.
ఆంధ్రా మొత్తం కానీ ధర్నా చేస్తే నీ తొమ్మిది జిల్లాల్లో ఏ ఒక్క జిల్లాలో కూడా తిరగలేవని, అడుగుపెట్టలేవని హెచ్చరించారు. ప్రాజెక్టులను కట్టి తీరుతామని తెలంగాణ సర్కార్ మొండిగా ప్రవర్తిస్తోందన్నారు. దీనిపై కేంద్రానికి, సుప్రీం కోర్టుకు, చంద్రబాబుకు సవాల్ చేస్తుండటం సరికాదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలన్నారు.