హైకోర్టులో రాజధానుల విచారణపై బొత్స కీలక వ్యాఖ్యలు-వాయిదా కోరడంపై అనుమానాలు ?
ఏపీలో మరోసారి మూడు రాజధానుల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇవాళ హైకోర్టులో మూడు రాజధానులపై దాఖలైన పిటిషన్లపై విచారణ ప్రారంభమై నవంబర్ 15కు వాయిదా పడిపోయింది. దీంతో హైకోర్టు విచారణ వాయిదా పడటానికి దారితీసిన కారణాలపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్లను ఉద్దేశించి బొత్స చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఏపీ రాజధాని కేసుల రోజువారీ విచారణను పిటిషనర్లు మూడు నెలలు వాయిదా కోరడం వెనుక ఏ ఉద్దేశాలు ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వాళ్లే కదా కేసులు వేసింది, మరి వాయిదా ఎందుకు అడిగారని బొత్స ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే విధానానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు తథ్యమన్నారు.

రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వ వాటర్ ప్లస్ సర్టిఫికేట్ కు ఎంపిక అయ్యేలా చూడాలని ముఖ్య మంత్రి జగన్ సూచించారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. దేశంలోని పట్టణాల్లో వ్యర్ధాల మేనేజమెంట్ పై స్వచ్ఛ భారత్ కింద కేంద్రం సర్వే చేసిందని, అందులో వాటర్ ప్లస్ సర్టిఫికెట్ కోసం 9 నగరాలను కేంద్రం గుర్తిస్తే మన రాష్ట్రం నుంచి 3 నగరాలు ఎంపిక అయ్యాయని బొత్స గుర్తు చేశారు. రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ, విశాఖ పట్నంలు ఈ సర్టిఫికెట్ కు ఎంపికయ్యాయని తెలిపారు. అన్ని పట్టణాలను ఇలానే తీర్చి దిద్దే లా పని చేయాలని అధికారులను సీఎం ఆదేశించారని బొత్స తెలిపారు.
టిడ్కో ఇళ్లపై స్పందిస్తూ... మొత్తం 2.6 లక్షల ఇళ్లు ఉన్నాయని, అన్నీ త్వరగా ఇచ్చేస్తామన్నారు. వీటిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు పసలేనివన్నారు. 6 నెలల్లో 80 వేలు..మరో 6 నెలల్లో మరో 80 వేలు...మిగిలినవి తర్వాత 6 నెలల్లో ఇస్తామని బొత్స తెలిపారు. ఇంటి నిర్మాణానికి డబ్బు సరిపోవడం లేదు అంటే ఇంతకు ముందు ఎంత ఇచ్చారో గుర్తు చేసుకోవాలని సూచించారు. విస్తీర్ణం లో చూసినా, డబ్బుల రూపం లో కూడా ఇప్పుడు ఎక్కువగా ఇస్తున్నామన్నారు. లోకేష్ వి అవగాహన లేని మాటలన్నారు.












Click it and Unblock the Notifications