సుప్రీం వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ సర్కార్-సీబీఐ దర్యాప్తుపై మంత్రి క్లారిటీ..!
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ఇవాళ ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, సీబీఐ దర్యాప్తుపై స్పందించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటన్నది ఆయన తేల్చిచెప్పేశారు. దీంతో ఎల్లుండి సుప్రీంకోర్టు విచారణలో ప్రభుత్వం ఏం చెప్పబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై విచారణలో స్పందించిన సుప్రీంకోర్టు.. ఆధారాలేవని ప్రశ్నించింది. అంతే కాదు లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తు సరిపోతుందా లేక కేంద్ర సంస్ధ అయిన సీబీఐతో దర్యాప్తు చేయించాలా అన్న దానిపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కూడా కోరింది. అలాగే సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ కల్తీపై చేసిన ఆరోపణలపైనా అభ్యంతరం తెలిపింది. వీటిపై మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పందించారు.

న్యాయవ్యస్ధపై తమకు గౌరవం ఉందని మంత్రి స్వామి వెల్లడించారు. అలాగే లడ్డూ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకైనా తమకు అభ్యంతరం లేదన్నారు. ఎల్లుండి సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తుపై తేల్చనున్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తుకైనా సిద్దమంటూ మంత్రి చేసిన ప్రకటన చూస్తుంటే ప్రభుత్వం కోర్టుకు ఇదే చెప్పబోతోందా అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మగా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో అదే సంస్ధకు ఇచ్చినా ఇబ్బందేమీ ఉండబోదన్న అభిప్రాయంలో ఏపీ ప్రభుత్వం ఉందా అన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications