చంద్రబాబు ముఖంలో రాజకీయంగా ప్రేతకళ: టీడీపీ మేనిఫెస్టో టిష్యూ పేపర్ కన్నా హీనం!!
టిడిపి మహానాడులో చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలకు ప్రకటించిన మేనిఫెస్టోపై ఏపీలో ఇంకా వైసీపీ నేతల నుంచి విమర్శలు వెల్లువగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి హామీలు ఇచ్చారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు టిడిపి మేనిఫెస్టో పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అలవికాని హామీలతో ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చంద్రబాబుపై మండిపడ్డారు. టిడిపి మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కారుమూరి టిడిపి మేనిఫెస్టో టిష్యూ పేపర్ కన్నా హీనం అన్నారు. అందులోని ఏ ఒక్కటీ అమలు కాదంటూ మండిపడ్డారు.

చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మేనిఫెస్టో అమలుపై చర్చకు రావాలని, ఎవరు ఎన్ని అమలు చేశారో చూద్దాం అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు సవాల్ విసిరారు. బాబుకు పదవీ కాంక్ష, రాష్ట్రాన్ని దోచుకోవాలన్న ఆలోచన వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖంలో రాజకీయంగా ప్రేత కళ కనిపిస్తుందని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.
చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలకు ఏటా 18 వేల రూపాయల చొప్పున ఇస్తానని ప్రకటించడం నమ్మశక్యంగా లేదన్నారు. పథకాలు ప్రజలు నమ్మేలా ఉండాలని మంత్రి కారుమూరి వెల్లడించారు. చంద్రబాబు ప్రకటించిన తల్లికి వందనం, దీపం పథకం అన్నీ అబద్ధపు హామీలేనని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.

గతంలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి అమలు చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. దోచుకో.. దాచుకో.. ఇదే బాబు సిద్ధాంతమని మంత్రి కారుమూరి విమర్శించారు . సీఎం జగన్ పాలనలో నిరుపేదలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు.












Click it and Unblock the Notifications