ఏపీలో తీసేసిన పెన్షన్లు ఇవే..! మండలిలో తేల్చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ సంఖ్యలో ఇచ్చిన పెన్షన్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రమంగా తొలగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ ఇదే అంశంపై శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. ఇందులో గత 9 నెలల కాలంలో తమ ప్రభుత్వం ఎన్ని పెన్షన్లను తొలగించిందో ఆయన వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 లక్షల పెన్షన్లు తీసేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. ఏవేవో కారణాలు చెప్పి పెన్షన్లు తీసేస్తున్నారని, పేదలకు ఇచ్చే పెన్షన్లను కూడా భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చాక కొత్త పెన్షన్లు ఇవ్వలేదని, గత వైసీపీ ప్రభుత్వంలో తాము 13 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చామని మరో ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ గుర్తుచేశారు. అసలు పెన్షన్ల తొలగింపులో పాటిస్తున్న విధానమేంటో చెప్పాలని మరో వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ప్రశ్నించారు.

వీటిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో పెన్షన్లు ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ అయితే వాటిని పెంచుకుంటూ వెళ్లింది టీడీపీ ప్రభుత్వాలే అని గుర్తుచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 24 లక్షల పెన్షన్లు తగ్గించారని, కానీ తాము కేవలం 14 వేల పెన్షన్లు మాత్రమే తొలగించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లక్షా 80 వేల మంది పెన్షన్లర్లు చనిపోయారన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 13 శాతం జనాభాకు పెన్షన్లు అందిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. మంత్రి చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఇప్పటివరకూ 14 వేల పెన్షన్లు మాత్రమే తొలగించినట్లు తేలింది. అయితే వైసీపీ సభ్యులు దీన్ని అంగీకరించలేదు.












Click it and Unblock the Notifications