అనకాపల్లి వాసులకు బ్యాడ్ న్యూస్-అసెంబ్లీలో సర్కార్ క్లారిటీ..!
ఏపీలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి పునర్విభజన తర్వాత వేరుపడిన అనకాపల్లి జిల్లా అవకాశాల విషయంలో తిరిగి విశాఖతో పోటీ పడటం కష్టంగానే మారుతోంది. వాస్తవానికి జిల్లాల పునర్విభజనకు ముందు అనకాపల్లి అంటే విశాఖే అన్నట్లుగా ఉన్న ఈ పట్టణం కాస్తా ఇప్పుడు సొంతంగా ఎదగాల్సిన పరిస్ధితుల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఓ కీలక ప్రాజెక్టును అనకాపల్లి వరకూ విస్తరిస్తారని ఆశించినా అలా జరగలేదు.
ఏపీలో రెండు ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో ముందుగా మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదిత అలైన్ మెంట్ ను కూడా విడుదల చేసింది. ఇందులో విశాఖ మెట్రోలో భాగంగా స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకూ ఓ లైన్ వస్తుందని స్ధానికంగా ప్రయాణికులు ఆశిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకూ మెట్రో రైల్ ప్రతిపాదన లేదని తేల్చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు.

విశాఖలో మెట్రో రైల్ కారిడార్ లపై 2051నాటికి ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని డీపీఆర్ రూపొందించామని మంత్రి నారాయణ అసెంబ్లీలో వెల్లడించారు. పీక్ అవర్ పాసింజర్ డైవర్షన్ ట్రాఫిక్ ఆధారంగా మెట్రో రైల్ పై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి నారాయణ వెల్లడించారు. కనీసం పాసింజర్ డైవర్షన్ పదివేలు ఉంటేనే మెట్రో రైల్ కు అనుమతి వస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు పీక్ అవర్ ట్రాఫిక్ 10వేలకు పైగా ఉండటంతో ఆయా కారిడార్లకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు పీక్ అవర్ ట్రాఫిక్ 3763 మాత్రమే రావడంతో కేంద్రం కుదరదని చెప్పిందన్నారు. ట్రాఫిక్ డైవర్షన్ కోసం ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నట్లు నారాయణ వెల్లడించారు.












Click it and Unblock the Notifications