మెట్రో పిల్లర్ను ఢీకొన్న బెంజ్ కారు: ఏపీ మంత్రి నారాయణ కుమారుడు మృతి
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ(22), అతడి స్నేహితుడు రవిచంద్ర మృతి చెందారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ(22), అతడి స్నేహితుడు రవిచంద్ర మృతి చెందారు. వీరిద్దరూ ప్రయాణిస్తున్న బెంజ్ కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గురువారం నెల్లూరులో నిశిత్ అంత్యక్రియలు జరగనున్నాయి.
నారాయణ కొడుకు మృతి: కేటీఆర్, లోకేష్ సహా నేతల దిగ్భ్రాంతి, పరామర్శించిన పవన్
ప్రముఖుల కుటుంబాల్లో విషాదం నింపిన హైదరాబాద్ రోడ్డు ప్రమాదాలు(పిక్చర్స్)
మార్గమధ్యలోనే..
సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఇద్దరినీ అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. నిశిత్, అతని స్నేహితుడ్ని ఆస్పత్రికి తరలించడంలో జీహెచ్ఎంసీ సిబ్బంది సాయం అందించారు. కాగా, ఘటనాస్థలం నుంచి కారును తొలగించారు. నిశిత్ తోపాటు మృతి చెందిన రవిచంద్ర వ్యాపారి చినబాబు కుమారుడు.
నారాయణ సంస్థల డైరెక్టర్గా..
నిశిత్ ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. కాగా, మంత్రి నారాయణ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న వెంటనే ఆయన హుటాహుటిన భారత్ బయలుదేరారు.
అతివేగం, సీటు బెల్టు ధరించకపోవడమే..
అతివేగం, సీటు బెల్టు ధరించకపోవడంతో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 120కి.మీ వేగంతో కారు ప్రయాణించిందని, ఛాతి, కడుపులో తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. నిశిత్ మరణ వార్తను విన్న మంత్రి నారాయణ భార్య, కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆస్పత్రికి చేరుకున్నారు. కాగా, సమాచారం అందుకున్న నారాయణ వియ్యంకుడు మంత్రి గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ బయలుదేరారు.
భారీ వర్షం కూడా కారణమే..
ప్రమాదం బుధవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో జరిగింది. కాగా, మృతి చెందింది మంత్రి కుమారుడనే విషయాన్ని పోలీసులు వచ్చే వరకు తెలియలేదు. అయితే, మంగళవారం అర్ధరాత్రి నగరంలో భారీ వర్షం కురియడం గమనార్హం. ప్రమాదానికి వర్షం కూడా ఓ కారణంగా తెలుస్తోంది.
అపోలోకు హరీశ్ రావు
నిశిత్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి లోకేష్.. తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్ బయల్దేరారు. తెలంగాణ మంత్రి హరీశ్ రావు అపోలో ఆస్పత్రికి వచ్చి నారాయణ కుటుంబసభ్యులను పరామర్శించారు. దగ్గరుండి అన్ని ఏర్పాట్లను ఆయనే చూస్తున్నారు. ఏపీ హోంమంత్రి చినరాజప్ప కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. కాసేపట్లో నిశిత్ మృతదేహాన్ని నారాయణ ఇంటికి తరలించనున్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిశిత్ మరణం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.