జగన్ బటన్ నొక్కడం వల్ల మహిళలు ఎలా తయారయ్యారంటే..
Minister Savitha: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి సర్కార్.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించింది. జగన్ హయాంలో అమలైన నవరత్నాలపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది కాస్త శాసన మండలిలో తీవ్ర దుమారానికి దారి తీసింది.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత.. విమర్శలకు కేంద్ర బిందువు అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి పనులు ఉండేవి కావని విమర్శించారు. స్వయం ఉపాధి లేకపోవడం వల్ల దాదాపుగా అన్ని సామాజిక వర్గాల వాళ్లు గంజాయికి అలవాటు పడ్డారని అన్నారు.

జగన్ బటన్ నొక్కి డబ్బులు విడుదల చేయడం వల్ల మహిళలు స్వయం ఉపాధిని కోల్పోయారని మంత్రి ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలు గానీ, కాపులు, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల వారందరూ ఎలా తయ్యారయ్యారంటే.. వీళ్లు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయి, మద్యానికి అలవాటు పడ్డారు.. అని విమర్శించారు. ఇదంతా వాళ్లకు పని లేకపోవడం వల్లేనని చెప్పారు.
ఆమె చేసిన ఈ వ్యాఖ్యల పట్ల మండలి ఛైర్మన్ కొయ్యె మోషేన్ రాజు, మండలిలో ఉన్న ఇతర వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ స్థానాల్లో నుంచి లేచి నిల్చున్నారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ పట్టుబట్టారు. దీనితో మండలిలో గందరగోళం నెలకొంది.
ఈ పరిస్థితుల మధ్యే మంత్రి సవిత తన ప్రసంగాన్ని కొనసాగించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన 2014- 2019 మధ్యకాలంలో ఈ పథకాలేవీ కొనసాగించలేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. అదే సమయంలో ఛైర్మన్ జోక్యం చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ సభ్యుడు తోట త్రిమూర్తులుకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో డీబీటీ విధానంలో జగన్ బటన్ నొక్కి డబ్బులు విడుదల చేయడం వల్ల దానికి అలవాటు పడిన మహిళలందరూ గంజాయికి అలవాటు పడ్డారంటూ మంత్రి చెప్పడం సరికాదని, దీన్ని తోసిపుచ్చుతున్నామని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు మంత్రి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలపై ఛైర్మన్ మోషెన్ రాజు సైతం స్పందించారు. ఈ మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రికి సూచించారు. రికార్డుల నుంచి కూడా తొలగించాలంటూ ఆయన శాసన మండలి అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications