మంత్రి రోజాపై ప్రశ్నల వర్షం - వైసీపీ నేతలకు సమస్యల స్వాగతం : పవన్ ను ఓడించినా..!!
ప్రభుత్వం 'గడప గడపకు మన ప్రభుత్వం' ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఈ కార్యక్రమం మొదలైంది. తొలి రోజునే ఎమ్మెల్యేలను..వైసీపీ నేతలను పలు సమస్యలను ప్రస్తావిస్తూ అనేక ప్రాంతాల్లో ఉక్కిరి బిక్కరి చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అనేక చోట్ల సమస్యలతో స్థానికులు స్వాగతం పలికారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటుగా.. స్థానిక ఎమ్మెల్యేలు పథకాల పైన ఆరా తీయటం.. వారి సమస్యలు తెలుసుకొనేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించారు.
మంత్రులను నిలదీసిన స్థానికులు
అయితే, తొలి రోజున ప్రధాని రోడ్లు..అధిక ధరలు.. పథకాల నిర్వహణ పైనే ఎక్కువగా సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని చోట్ల మంత్రులను సైతం స్థానికులు నిలదీసారు. రహదారులు గురించే అనేక ప్రాంతాల్లో గట్టిగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో మంత్రి జయరాంకు స్థానికులు సమస్యలను చెప్పుకొనే ప్రయత్నం చేసారు.
వారానికో సారి నీటిని ఇస్తున్నారని.. బోర్లు చెడిపోయాయంటూ మంత్రితో మొర పెట్టుకున్నారు. కానీ, వారికి మంత్రి నుంచి సమస్య పరిష్కారానికి స్పష్టమైన హామీ లభించలేదు. పథకాలు..పెన్షన్లు అందుతున్నాయా అనే అంశం పైనే మంత్రి ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. పత్తికొండ నియోజకవర్గంలో నాణ్యమైన రేషన్ బియ్యం సరఫరా చేయడం లేదని కొందరు ఎమ్మెల్యే శ్రీదేవి వద్ద నిరసన తెలిపారు.
రోజాకు ప్రశ్నలు..అధిక ఛార్జీల ఎఫెక్ఠ్
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని టీసీ అగ్రహారం, కల్లూరు గ్రామ సచివాలయాల పరిధిలో పర్యటించిన మంత్రి రోజాపై స్థానికులు ధరల పెరుగుదలపై ప్రశ్నల వర్షం కురిపించారు. డమాలపేట మండలం కల్లూరు గ్రామంలో 'గడప గడప..'లో పాల్గొన్నారు. కల్లూరు గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి ఈ సందర్భంగా కరెంటు చార్జీల పెంపుపై రోజాను నిలదీశారు.
అమ్మఒడి ఇస్తున్నారు... కానీ కరెంటు చార్జీలు పెంచేశారు... ఎలా కట్టాలి?' అంటూ ఆమెను ఓ గ్రామస్థుడు సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తెలివంతా చూపించొద్దంటూ సమాధానం దాటవేసి అక్కడ నుంచి ఆమె ముందుకు సాగారు. తెలంగాణలో వేతనాలు 2వేలు పెంచారని, ఇక్కడ తమకు కూడా పెంచాలని ఓ ఆశా వర్కర్ కోరగా, అది స్టేట్ పాలసీ అంటూ అక్కడ నుంచి ముందుకు సాగారు.
రోడ్లు - మంచినీరు పైనే ప్రధానంగా
కోడుమూరు నియోజకవర్గం దేవమడలో ఎమ్మెల్యే సుధాకర్ని స్థానిక మహిళలు... 'గెలిచి మూడేళ్లవుతోంది. మా గ్రామానికి ఏం చేశారంటూ నిలదీసారు. రోడ్లు, మురుగు కాల్వలు అధ్వానంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో మంత్రి అంబటి రాంబాబు.... ప్రభుత్వ పథకాలపై రూపొందించిన బుక్లెట్తో పర్యటించారు.
డిగ్రీ చదువుతున్న తన కుమార్తె కోట అనూషను 2021 ఫిబ్రవరిలో హత్య చేసిన నిందితుడికి ఇంతవరకు శిక్ష పడలేదని ఆమె తల్లి వనజాక్షి మంత్రి అంబటి రాంబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అది కోర్టు పరిధిలో ఉన్నందున.. ఏమీ చేయలేమని, చట్టపరంగా నిందితుడికి శిక్ష పడుతుందని మంత్రి చెప్పుకొచ్చారు.
పవన్ ను ఓడించినా గుర్తింపు లేదంటూ
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని అర్జాపురంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని నిత్యావసరాల ధరలు, కరెంటు ఛార్జీలు పెరగడంపై మహిళలు నిలదీశారు. ఎన్నికల్లో పవన్ కల్యాణ్ని ఓడించినా.. తమ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్కు సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ భీమవరం నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. గత నెలలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో గ్రంధి శ్రీనివాస్ కు మంత్రి పదవి వస్తుందని..ఆయన అనుచరులు ఆశించారు. కానీ, దక్కక పోవటంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు.