సమ్మె వద్దు.. చర్చించుకుందాం రండి..! పీఆర్సీ సాధన సమితికి మంత్రులు పిలుపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. రోడ్ల మీదకు వచ్చి జగన్ సర్కార్కు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలకు దిగాయి. కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సమ్మె నోటీసులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నాయి. ఈ తరుణంలో పీఆర్సీ సాధన సమితి నేతలను సంప్రదింపులకు ప్రభుత్వం ఆహ్వానించింది. ఉద్యోగ సంఘాల నాయకులకు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ఫోన్ చేసి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.
పీఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చలు..
వైసీపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకు విజయవాడలోని రెవెన్యూ భవన్ లో ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు సమావేశమైయ్యారు. రేపు సీఎస్కు ఇవ్వదలచిన సమ్మె నోటీసులు, ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఇదే సమయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్నినాని నుంచి ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్ వచ్చింది. సమస్యను మరింత జఠిలం చేయోద్దని.. సమ్మె నోటీసులు ఇవ్వొద్దని కోరారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రభుత్వంతో చర్చలకు రావాలని మంత్రులు ఆహ్వానించారు. అయితే వారి ప్రతిపాదనను ఉద్యోగ సంఘాల నేతలు తిరస్కరించారు. పీఆర్సీ జీవోను రద్దు చేస్తేనే ప్రభుత్వంతో సంప్రదింపులకు వస్తామని మంత్రులకు వారు తేల్చిచెప్పారు..
సమ్మె నోటీసుపై వెనక్కి తగ్గేది లేదు..
అటు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణతో పాటు ఇతర సంఘాల నేతలు హాజరైయ్యారు. ఈ సమావేశంలో మంత్రుల నుంచి వచ్చిన పిలుపు, సమ్మె నోటీసులు, ఉద్యోగ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాల్సివస్తే వారి ముందు ఎలాంటి ప్రతిపాదనను పెట్టాలనే దానిపై ఈ స్టీరింగ్ కమిటీ భేటీలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. రేపటి సమ్మె నోటీసుపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు.. కొత్త పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని సాధన సమితి నేతలు స్పష్టం చేశారు. ఇప్పటికే ఫిబ్రవరి 7 నుంచి సమ్మెలకు పిలుపునిచ్చినట్లు వారు గుర్తు చేశారు.
ఉద్యోగ సంఘాలకు ఆర్టీసీ యూనియన్ల మద్దతు
మరో వైపు ఉద్యోగుల సమ్మెకు ఆర్టీసి సిబ్బంది కూడా మద్దతు పలికారు. తాము కూడా ఆందోళనలో పాల్గొంటామని ఎన్ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సుజాత తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సిబ్బంది సమస్యలు అనేకం తీరకుండా మిగిలిపోయాయని పేర్కొన్నారు. ఐఆర్ విషయంలో చాలా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు నాలుగేళ్లకోసారి వేతన సవరణ ఉండేది .. కానీ పదేళ్లకోసారి వేతన సవరణ మార్పుతో తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి పోరాడతామని హెచ్చరించారు.