విషాదం:హోటల్లో టిఫిన్ చేస్తూచేస్తూనే...వ్యక్తి హఠాన్మరణం
నెల్లూరు: హోటల్లో టిఫిన్ చేసేందుకని వచ్చాడు...మళ్లీ లేచి వెళ్లబోయాడు...ఓ మహిళ వారించి అల్పాహారం సేవించాల్సిందిగా కోరింది. సరేనని కూర్చోని తింటున్న ఆ వ్యక్తి హఠాత్తుగా వాంతులు చేసుకొని అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ సంఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని ప్రకాశంజిల్లా ఉలవపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన సోమిశెట్టి రమేష్ (30) గా గుర్తించారు. కావలిలోని తుమ్మలపెంట రోడ్డులోని సింధుహోటల్లో ఈ విషాదం చోటుచేసుకుంది.
సోమిశెట్టి రమేష్ సింధుహోటల్ కు మరో మహిళతో కలసి వచ్చాడు. అయితే ఏమైందో ఏమో రమేష్ హఠాత్తుగా హోటల్ నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో అతనితో పాటు ఉన్న మహిళ రమేష్ ను బలవంతంగా టిఫిన్ చేసేందుకు కూర్చోబెట్టింది. అయితే మహిళ చపాతి పార్శిల్ చేయించుకోగా రమేష్ టిఫిన్ చేయడం ఆరంభించాడు. అయితే టిఫిన్ చేస్తూచేస్తుండగానే రమేష్ ఒక్కసారిగా వాంతులు చేసుకొని టేబుల్ పైనే కుప్పకూలాడు.దీంతో రమేష్ తో పాటు వచ్చినట్లుగా భావిస్తున్న మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుండగా స్ధానికులు పట్టుకొని ఆమెను పోలీసులకు అప్పగించారు.
అయితే ఆ మహిళ మాత్రం రమేష్ ఎవరో తనకు తెలియదని, తాను హోటల్లో కూర్చొని ఉండగా రమేష్ వచ్చి తన పక్కన కూర్చోబోయాడని...మరలా అక్కడ నుంచి వెళ్లి పోతుంటే వారించి ఎదురుగా కూర్చొని తినమని మాత్రమే చెప్పానని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. స్ధానికులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం ఏరియావైద్యశాలకు తరలించారు.