నేనుండగా: ఎన్జీవోలకు కిరణ్ 2హామీలు, చర్చలు విఫలం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమకు రెండు హామీలు ఇచ్చారని ఎపిఎన్జీవోలు బుధవారం అన్నారు. ముఖ్యమంత్రితో ఎపిఎన్జీవోల చర్చలు విఫలమయ్యాయి. కిరణ్తో చర్చల అనంతరం ఎన్జీవో నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ముఖ్యమంత్రి తమకు రెండు హామీలు ఇచ్చారని తాను పదవిలో ఉన్నంత కాలం రాష్ట్ర విభజన జరగదని చెప్పారని, అలాగే తన వైఖరిని ఇలాగే కొనసాగిస్తానని చెప్పారని తెలిపారు. విభజన జరగదని ముఖ్యమంత్రితో పాటు తమకు కేంద్రం నుండి స్పష్టమైన హామీ కావాలన్నారు.
అప్పుడే తాము తమ సమ్మెను విరమించే విషయంపై పునరాలోచిస్తామన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నందున, తుఫాను వచ్చే అవకాశం ఉన్నందున సమ్మె విరమించాలని కిరణ్ తమను కోరారని ఎపిఎన్జీవో నేతలు చెప్పారు. అయితే తమకు స్పష్టమైన హామీ వస్తేనే విరమిస్తామని తాము చెప్పామన్నారు.
కేంద్రం పరిధిలోకి వచ్చే అంశంపై తాను ఏం చెప్పలేనని కిరణ్ తెలిపారని చెప్పారు. తెలంగాణపై తీర్మానం రెండుసార్లు అసెంబ్లీకి వస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లుగా కిరణ్ తెలిపారన్నారు. ఢిల్లీ పెద్దలు రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
చిత్తశుద్ధితో పని చేస్తున్నామని సిఎం చెప్పారు: అశోక్
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏం చర్యలు తీసుకుంటారని తాము సిఎంను, ఇతర మంత్రులను ప్రశ్నించామన్నారు. అహింసాయుతంగా కొనసాగుతున్న సమ్మెను ముఖ్యమంత్రి అభినందించారన్నారు.
సమ్మెపై హోంశాఖ స్పందించాలన్నారు. సమ్మెను విరమించే ప్రసక్తి లేదన్నారు. తుఫాన్ వస్తే సమ్మె చేస్తూనే తాము సహాయక చర్యలు చేపడతామని ప్రభుత్వానికి చెప్పామన్నారు. అసెంబ్లీకి తీర్మాంనం వస్తుందని, దానిని వ్యతిరేకిస్తామని కిరణ్ చెప్పారన్నారు. అధికార పార్టీ నేతలుగా సమైక్యాంధ్ర కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారన్నారు.