వరుస సర్జరీలతో ఏపీ రాజకీయ నేతలు.. పవన్ తో మొదలై బాలయ్య, షర్మిల వరకు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ రాజకీయ నేతలకు వరుసగా సర్జరీలు జరుగుతున్న అంశం రాష్ట్రంలో చర్చకు కారణంగా మారింది. వివిధ అనారోగ్య కారణాలతో ఏపీ ప్రముఖ రాజకీయ నేతలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మొదలుపెట్టి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల వివిధ కారణాలతో ఆసుపత్రులలో చేరారు.
పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్ర చికిత్స
ఈనెల జూలై 11వ తేదీన పవన్ కళ్యాణ్ ముంబై లోని ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో భుజం శస్త్ర చికిత్స చేయించుకున్నారు. రొటేటర్ కఫ్ గాయం, అవల్షన్ ఫ్రాక్చర్ కారణంగా సుమారు మూడున్నర గంటల పాటు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పర్దివాలా నేతృత్వంలోని బృందం విజయవంతంగా శస్త్ర చికిత్సను పూర్తి చేసింది. పవన్ కళ్యాణ్ ఎడమ భుజం ఆపరేషన్ కొన్ని నెలల తర్వాత చేయవలసి ఉంది.

బాలకృష్ణ మోకాలికి గాయంతో ఆస్పత్రిలో చేరిక
ఆపరేషన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు పరామర్శించారు. ప్రస్తుతం డిశ్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్ మంత్రిగా తన శాఖల కార్యకలాపాలలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా జూలై 23వ తేదీన హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తన సినిమా షూటింగ్లో గాయాల పాలయ్యారు. ఎన్.బి.కె 111 సినిమా షూటింగ్లో పాల్గొన్న బాలకృష్ణ యాక్షన్ సీక్వెన్స్ లో గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.
బాలయ్య మోకాలికి శస్త్రచికిత్స.. పలకరించిన చంద్రబాబు
ఆయన ఎడమ మోకాలి క్వాడ్రిసెప్స్ టెండన్ కు తీవ్ర గాయం కావడంతో, హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో మూడు గంటల పాటు ఆయన మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆపరేషన్ విజయవంతం కాగా, సీఎం చంద్రబాబు బాలకృష్ణను పరామర్శించారు. బాలకృష్ణ ఆరోగ్యం కోసం ఆందోళన చెందిన అభిమానులకు, బాలకృష్ణ త్వరగానే కోలుకుంటారని చెప్పి కుమార్తె నారా బ్రాహ్మణి బాలకృష్ణ పట్ల వారి ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.
షర్మిలకు ఉదర సంబంధిత సమస్య
ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షర్మిల తాజాగా పొత్తు కడుపు సంబంధిత సమస్యతో బాధపడుతుండగా వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. షర్మిల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపైన సోషల్ మీడియా వేదికగా స్పందించారు షర్మిల.
శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్నా అన్న షర్మిల
తనకు ఉదర సంబంధిత చికిత్స జరిగిందని, చికిత్స అనంతరం వేగంగా కోలుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన శ్రేయోభిలాషులు మద్దతుదారులకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ రాజకీయ నేతలు వరుసగా శస్త్ర చికిత్సలతో ఆసుపత్రులలో ఉండడం చర్చకు కారణమైంది.












Click it and Unblock the Notifications