బెంగళూరు రోడ్డు ప్రమాదంలో ఏపీ టెక్కీ మృతి, ఏడాది క్రితమే పెళ్లి
రోడ్డు ప్రమాదంలో టెక్కీ దుర్మరణం చెందిన సంఘటన బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
నెల్లూరు/బెంగళూరు: రోడ్డు ప్రమాదంలో టెక్కీ దుర్మరణం చెందిన సంఘటన బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ ఓ సాఫ్టువేర్ కంపెనీలో పని చేస్తున్నాడు.
మారతహళ్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. అతను శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో విధులు ముగించుకొని ద్విచక్ర వాహనం పైన బయలుదేరాడు. ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లై ఓవర్ ఇన్ఫోసిస్ గేట్ వద్ద వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఇతని బైక్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డికి గత ఏడాది వివాహం అయింది.