ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ - కలిసొచ్చేనా..!!
ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయంగా కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. పొత్తుల లెక్కలు మారుతున్నాయి. సీఎం జగన్ ఇంఛార్జ్ ల మార్పు పైన కసరత్తు చేస్తున్నారు. పార్టీల మార్పులు మొదలయ్యాయి. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వానికి అరుదైన గుర్తింపు దక్కింది. విద్య అందించడంలో అగ్రపథాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. కేరళ ఈ విషయంలో మాత్రం ఏపీకన్నా తక్కువ స్కోరు సాధించింది.
ఏపీకి ప్రధమ స్థానం : ఏపీలో జగన్ ప్రభుత్వం తొలి నుంచి విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం జగన్ అమలు చేస్తున్న సంస్కరణలు చక్కని ఫలితాలిస్తున్నాయి. తాజాగా ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా నివేదిక దీన్ని నిరూపించింది. కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ బిబేక్ దేబ్రాయ్ ఈ మేరకు నివేదికలు విడుదల చేసిన నివేదికలో ఏపీకి గుర్తింపు దక్కింది. ఫౌండేషన్ 'విద్య అందుబాటు' అనే అంశంలో ఏపీ 38.50 స్కోరుతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో అక్షరాస్యత, ఇతర అంశాల్లో అగ్రస్థానంలో ఉన్న కేరళ ఈ విషయంలో మాత్రం ఏపీకన్నా తక్కువగా 36.55 స్కోరు సాధించింది.

కేరళను అధిగమించి : ఇదే అంశాన్ని ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ తన నివేదికలో ప్రస్తావిస్తూ చిన్న రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ విద్య అందుబాటు అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవచ్చు అని పేర్కొంది. దీంతోపాటు కేంద్రం నిర్దేశించిన ఐదు అంశాల్లో జాతీయ సగటు స్కోరు 28.05గా ఉంటే సగానికి పైగా రాష్ట్రాలు అంతకన్నా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక పేర్కొంది. 'విద్య అందుబాటు'లో రాజస్థాన్ 25.67, గుజరాత్ 22.28, బీహార్ 18.23 స్కోరు మాత్రమే సాధించాయి. ఈ నివేదిక.. పిల్లల పూర్వ ప్రాథమిక విద్య, పునాది స్థాయి అక్షరాస్యత అంశాలను విశ్లేషించింది.

విద్య సంస్కరణల ఫలితం : పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో అక్షర, సంఖ్యా జ్ఞానాలకు సంబంధించి చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలెలా ఉన్నాయో ఈ నివేదిక గమనంలోకి తీసుకుని చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అంశాల వారీ స్కోరును పొందుపరిచింది. ఫౌండేషన్ విద్య పటిష్టంగా లేకుంటే పై తరగతుల్లో అభ్యసన సామర్థ్యాలు దెబ్బతినే ప్రమాదమున్నందున ఈ నివేదికలో వాటిని వివరిస్తూనే ఇతర సూచనలు అందించింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఏపీ ప్రభుత్వానికి విద్యా రంగంలో దక్కిన ఈ గుర్తింపు వైసీపీ ప్రభుత్వానికి కలిసొచ్చే అంశంగా నిలుస్తోంది.












Click it and Unblock the Notifications