ఏపీ హోంXటీ హోం: మోడీ వద్దకు రేవంత్ ఇష్యూ, బాబుపై కేసీఆర్ ఫిర్యాదు?
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి అరెస్టు, తదితర పరిణామాల పైన తెరాస, తెలుగుదేశం పార్టీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం సాగుతోంది. ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామని ఇరువర్గాలు చెబుతున్నాయి!
రేవంత్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకు వస్తాయని ఇటీవల తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు. దానిపై తెలంగాణ, ఏపీ టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. దీనికి తెరాస కూడా ఘాటుగా స్పందిస్తోంది.
ఈ వ్యవహారమంతా కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామని టీడీపీ చెప్పింది. తెరాస కూడా అదే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని తెరాస ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఎమ్మెల్యేల కొనుగోలులో చంద్రబాబు ప్రమేయం గురించి కేంద్రంలోని పెద్దలకు వివరించాలని తెరాస యోచిస్తున్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే వారం ఢిల్లీ వెళ్లనున్నారు. తన ఢిల్లీ పర్యటనలో రేవంత్ వ్యవహారం గురించి కేంద్రానికి తెలిపే అవకాశముందని తెలుస్తోంది.
ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ వీడియోలో పలుమార్లు బాస్ గురించి ప్రస్తావించారు. ఆ బాస్ చంద్రబాబేనని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ కేంద్రానికి చెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు.
మరోవైపు, టీడీపీ నేతలు కూడా అదే చెబుతున్నారు. కేసీఆర్ కుట్రపూరితంగా రేవంత్ను ఇరికించారని, ఇదే విషయాన్ని తాము కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామని ఏపీ డిప్యూటీ హోంమినిస్టర్ చినరాజప్ప చెప్పారు. రేవంత్ వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబేనని తెలంగాణ హోం నాయిని నర్సింహా రెడ్డి ఆరోపిస్తున్నారు. దమ్ముంటే వీడియోలు విడుదల చేయాలని ఏపీ హోం చినరాజప్ప సవాల్ చేస్తున్నారు.