ఇచ్చేది కొంచెం.. పొందేది ఘనం? నీట్ జాతీయ ఫూల్లో చేరితే మేలు మనకే
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో వైద్యవిద్యను అభ్యసించాలని అభిలషించే విద్యార్థులకు శుభవార్త. ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో మాత్రమే ఎంబీబీఎస్ అడ్మిషన్లు జరిగేవి. కానీ వచ్చే విద్యాసంవత్సరం (2018 - 19) నుంచి నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షకు జాతీయ పూల్లో ఆంధ్రప్రదేశ్ చేరిక ఖరారైనట్లు తెలిసింది. ఇందులో చేరడం ద్వారా మన ప్రభుత్వ బోధనా కళాశాలల్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం జాతీయ పూల్కు కేటాయించాల్సి ఉంటుంది.
ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇచ్చే సీట్లకు కూడా మనం పోటీపడే అవకాశం లభిస్తుంది. అదే పీజీ వైద్య సీట్లకొచ్చేసరికి 50 శాతం సీట్లు మనం జాతీయ కోటాలోకి ఇవ్వడం, అన్ని రాష్ట్రాలు ఇచ్చే 50 సీట్లకూ మనం పోటీపడటం జరుగుతుంది.

అధికారికంగా ఏపీకి సమాచారం ఇచ్చిన కేంద్రం
రెండు నెలల కిందటే ఏపీ వైద్య విద్యాశాఖ కేంద్ర ప్రభుత్వంతో పాటు సీబీఎస్ఈకి లేఖ రాసింది. దీనికి స్పందించిన కేంద్రం.. మన రాష్ట్రాన్ని నేషనల్ పూల్లో చేరుస్తున్నట్లు అధికారికంగా చెప్పిందని వైద్యవిద్యాశాఖ వర్గాలు చెప్పాయి. ఇప్పటివరకూ పలు రాష్ట్రాలు జాతీయ పూల్లో ఉన్నా మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, జమ్ముకాశ్మీర్ ఈ పరిధిలో లేవు. తాజాగా, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కూడా జాతీయ పూల్లో చేరేందుకు సమ్మతించడంతో తెలుగు విద్యార్థులు మరిన్ని సీట్లకు పోటీపడే అవకాశం లభిస్తోంది. 2018-19లో జరిగే ప్రవేశ పరీక్షలో మనకు జాతీయ పూల్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. కాగా, ఇప్పటికే పీజీ వైద్య సీట్ల ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైందని.. ఆంధ్రప్రదేశ్ జాతీయ పూల్లో ఉన్నట్టు బ్రోచర్లో పేర్కొన్నట్టు వైద్య విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

కేటాయించేది వందల్లో.. వేలల్లో లబ్ధి ఇలా
జాతీయ పూల్లో చేరడంవల్ల ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లకు పోటీపడే అవకాశం లభించడం ఆంధ్రప్రదేశ్కు కలిసొచ్చే అంశమని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 1900 స్థానాలకు 15 శాతం సీట్లు కేవలం 285 సీట్లను జాతీయ పూల్కు కేటాయిస్తే.. దేశవ్యాప్తంగా 27,710 సీట్లకు అన్ని రాష్ట్రాలకు 15 శాతం ఇచ్చే 4157 సీట్లలో పోటీపడేందుకు తెలుగు విద్యార్థులు పోటీ పడేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. దీంతో నేషనల్ ఫూల్ కోటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేటాయించే సీట్లతో కలిసి మొత్తం 4,442 సీట్లు ఉంటాయి. ఇక పీజీ వైద్యవిద్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 660 సీట్లకు 50 శాతం జాతీయ ఫూల్ ప్రకారం 330 సీట్లు ఇతర రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉంటుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా 13,872 సీట్లలో సగం సీట్లు పరిగణనలోకి తీసుకుంటే 6936 సీట్లు ఏపీకి లభిస్తాయి.












Click it and Unblock the Notifications