'వాళ్లనొదిలేద్దాం: మోడీపై మోజుతో పవన్, రాఖీ పార్టీలు'
హైదరాబాద్: పార్టీని విస్మరించిన వారిని వదిలేద్దామని, క్రియాశీలకంగా ఉన్న వారికే టిక్కెట్లు ఇద్దామని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు నిర్ణయించారు. శనివారం ఇందిరాభవన్లో ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి, ప్రచార కమిటీ కన్వీనర్, కేంద్ర మంత్రి చిరంజీవి, ప్రచార కమిటీ సహ చైర్మన్ డొక్కా మాణిక్య వర ప్రసాద్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆనం రామనారాయణ రెడ్డి, కేంద్రమంత్రి జెడి శీలం, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు, సీమాంధ్ర జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారని డిసిసి అధ్యక్షులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన నేతలు.. పార్టీని విస్మరిస్తున్న వారిని, కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారిని ఇక విడిచిపెడదామని, క్రియాశీలకంగా వ్యవహరించాలని ఇప్పటికే పలుమార్లు కోరినందున మళ్లీ విజ్ఞప్తి చేయాల్సిన అవసరం లేదని రఘువీరా రెడ్డి చెప్పారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటే, వారిని వదిలి.. 2019 వరకు పార్టీ కోసం పని చేసే ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహిద్దామన్నారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించే అభ్యర్థులను గుర్తించాలని డిసిసి అధ్యక్షులకు సూచించారు. బస్సుయాత్రలకు కూడా కొందరు ఎమ్మెల్యేలు హాజరు కాలేదని గుర్తు చేశారు. పార్టీని వద్దనుకున్న వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వారిని తిరిగి రావాలని ఇప్పటికే పలుదఫాలు విజ్ఞప్తి చేశామని రఘువీరా స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీలను కేవలం రిజర్వుడ్ స్థానాలకే పరిమితం చేయకుండా ఓపెన్ కేటగిరి స్థానాల్లోనూ పోటీ చేసేందుకు వీలుగా టికెట్లు ఇద్దామని సూచించారు. ఐదేళ్ల పాటు పార్టీ బలోపేతంపై దృష్టి పెడితే పూర్వవైభవం తప్పక వస్తుందని రఘువీరా తెలిపారు. 31లోగా నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున పేర్లు ఇవ్వాలని సూచించారు. పదేళ్లు మంత్రులుగా ఉన్న వారు లోక్సభకు పోటీ చేయాలని కొందరు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
కాగా, 31లోగా మేనిఫెస్టో కమిటీ నివేదిక రూపొందిస్తుందని, ఆ కమిటీ చైర్మన్ ఆనం వివరించారు. ఈలోగా వివిధ వర్గాలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 1న ఎపిసిసి ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుందని, ప్రాథమికంగా చర్చించిన పేర్ల జాబితాతో రఘువీరా ఢిల్లీ పెద్దలతో మాట్లాడతారని ఆనం వివరించారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాల ఆధారంగా ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని ఎపిసిసి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆనం చెప్పారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ అవసరాన్ని బస్సుయాత్రలో ప్రజలకు వివరించడంలో సఫలీకృతమయ్యామన్నారు.
ఆయా జిల్లాల్లో ప్రధాన సమస్యలు, మేధావులను సంప్రదించి నవ్యాంధ్ర నిర్మాణానికి అవసరమైన సూచనలు, సలహాలు సేకరించాలని నేతలకు సూచించామన్నారు. ప్రచార కమిటీ కో చైర్మన్ డొక్కా మాణిక్యవరప్రసాదరావు మాట్లాడుతూ చిన్న జిల్లాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని, సీమాంధ్రలో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేయాలని మేనిఫెస్టో కమిటీకి విజ్ఞప్తి చేశామన్నారు.
బడుగులతో కాంగ్రెస్ది పేగుబంధమని, ఈ బంధాన్ని తెగ్గొట్టేందుకు కొందరు కత్తెరలు పట్టుకుని తిరుగుతున్నారని, కాంగ్రెస్ను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని జెడి శీలం మండిపడ్డారు. కాంగ్రెస్ బలహీనపడితే దళితులు బలహీనపడినట్లేనన్నారు. మోడీ కిరాతకుడు, నరరూప రాక్షసుడని, మోడీపై మోజుతోనే రాకీ సావంత్, పవన్ కళ్యాణ్లాంటి నటులు పార్టీ పెడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications