జగన్కు ఆఫర్ మీద ఆఫర్: కాంగ్రెస్లో చేరితే బాబుకే లాభమా?
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తమ పార్టీలోకి జగన్ రావాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి చెప్పారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ ఇవే వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి చేయడం గమనార్హం. రఘువీరా మాట్లాడుతూ.. జగన్ కాంగ్రెస్ పార్టీతో కలవాలన్నారు. కాంగ్రెస్ పార్టీతో జగన్ జత కలిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. మాజీ మంత్రి జేడీ శీలం కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాధికారత యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో రఘువీరా, జేడీ శీలంలు జగన్కు స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్తో పాటు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు కూడా స్వాగతం పలుకుతున్నారు.
అయితే, విభజన నేపథ్యంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో జీరో స్థాయికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీలో చేరితే జగన్కు ఎలాంటి ఫలితం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటును కూడా గెలుచుకోలేకపోయింది.
ఇప్పటికీ ఆ పార్టీ పరిస్థితి ఆశించినంత లేదు. ఇందుకు ఇటీవల చింతామోహన్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. తమ పార్టీకి సరైన నాయకత్వం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పటికీ ఏపీలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని చెప్పవచ్చు.
ఇలాంటి కాంగ్రెస్ పార్టీతో జత కలిస్తే జగన్ నష్టపోక తప్పదని అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ - జగన్ కలిస్తే ఇన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ చేసిన వ్యాఖ్యలు కూడా నిజమవుతాయని, అప్పుడు టిడిపి మరింత దూకుడు పెంచుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
జగన్లో కాంగ్రెస్ రక్తం ఉందని, ఎప్పటికైనా ఆ పార్టీతో జగన్ కలవక తప్పదని టిడిపి మొదటి నుంచి చెబుతోంది. ఆ వ్యాఖ్యలను జగన్ ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ చేరితే.. అది కాంగ్రెస్కు ఏం లాభం చేస్తుందనే విషయాన్ని పక్కన పెడితే, జగన్కు నష్టాన్ని, చంద్రబాబుకు లాభాన్ని తెచ్చి పెడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, రెండు పార్టీల ఓటు బ్యాంక్ కలుస్తుందనే వారూ లేకపోలేదు.