మంత్రులకు అశోక్ హెచ్చరిక: పవన్కు సరిపడవని గంటా
కొంతమంది రాజీనామా చేయకుండానే విభజన అయిపోయిందనే ప్రచారం చేయడం సరికాదన్నారు. కేంద్రమంత్రులు రాజీనామా చేయనంత మాత్రాన విభజన ప్రక్రియ జరిగిపోదన్నారు. గతంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే రాజధాని వేరుగా ఏర్పాటు చేసుకున్నారని, ఇప్పుడు కొత్త రాష్ట్రం కోరుతున్న వారు తమదే రాజధాని అంటున్నారని ఇదేమిటని ప్రశ్నించారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు అందరు రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి సమైక్యత కోసం పోరాడాలన్నారు.
సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, మంత్రులు విభజన ప్రక్రియను అసెంబ్లీలో, పార్లమెంటులో అడ్డుకోవాలని సూచించారు. సీమాంధ్ర ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఎపి వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మాటలను తాము పట్టించుకోమన్నారు. ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగదన్నారు.
కేంద్రంపై గంటా ఫైర్
కేంద్ర ప్రభుత్వం పైన మంత్రి గంటా శ్రీనివాస రావు వేరుగా మండిపడ్డారు. కేంద్ర నాయకత్వం విభజంపై పూటకో మాట మారుస్తుందన్నారు. దిగ్విజయ్కు సీమాంధ్ర నేతలను విమర్శించే నైతికత లేదన్నారు. షిండే దొడ్డదారిన తెలంగాణ నోట్ తెచ్చారని ఆరోపించారు. రాజకీయ నిర్ణయం తీసుకున్నప్పుడు రాజకీయ ప్రయోజనాలే ఆలోచిస్తారని విమర్శించారు. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారని తాను భావించడం లేదన్నారు. ఆయన సినిమాల్లో సూపర్ స్టార్గా ఉన్నారన్నారు.
సమైక్యమే..: కమలానంద భారతి
విభజన జరిగితే హిందూ సమాజం నష్టపోతుందని కమలానంద భారతి అన్నారు. విభజన జరిగితే సీమాంధ్రలో క్రైస్తవులు, తెలంగాణలో మజ్లిస్ బలపడుతుందన్నారు. అదే సమయంలో ఆయన బిజెపి పాలనలోనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. చంద్రగుప్తుడి తర్వాత వందలు, వేల ఏళ్ల తర్వాత బిసి నేత అయిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాలించనున్నారన్నారు.