మోసం చేసిన ప్రియుడు: లేడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య, సెల్ఫీ వీడియో
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కావలిలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. భాను అనే యువకుడు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మాధవి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమె డిబిఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తోంది.
తాను ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన కారణాలను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసింది. తనకు జీవితం మీద ఆశ లేదని, తాను ఎవరికీ ఇబ్బందికరంగా మారాలని భావించడం లేదని ఆమె అందులో చెప్పింది. తమ పెళ్లి విషయంలో భాను ఇక ఎవరినీ ఒప్పించాల్సిన అవసరం లేదని ఆమె వీడియోలో తెలిపింది.
భగవంతుడి దృష్టిలో తామిద్దరికీ ఎప్పుడో వివాహం జరిగిందని, ఈ జన్మకు అది చాలునని చెప్పింది. తనను ఎవరూ తప్పు పట్టవద్దని మాధవి కోరింది. తన సూసైడ్ నోట్ను మూడు నిమిషాల సేపు వీడియో రికార్డ్ చేసి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది.
పెళ్లి చేసుకోలేకపోయాం, కనీసం తాను చనిపోయిన తర్వాత తన శవానికి గాజులు వేసి, తన నుదుట బొట్టు పెట్టాలని ఆమె తన చివరి కోరికగా భాను తేజకు వీడియో రికార్డింగ్ ద్వారా తెలిపింది. మాధవి మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాధవి ఫోన్లో వీడియో లభించడంతో భాను తేజపై ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భాను తేజ నెల్లూరులోని ఓ బంగారం దుకాణంలో పని చేస్తున్న సమయంలో మాధవికి పరిచమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ప్రేమించుకుంటున్న సమయంలో భాను తేజ మాధవి తల్లి శాంతమ్మ పేరు మీద ఉన్న పొలం, ఇల్లు తనకు రాసివ్వాలని కోరాడు. తల్లికి మాధవి ఆ విషయం చెప్పింది. పెళ్లయిన తర్వాత రాసిస్తానని శాంతమ్మ చెప్పింది.
అందుకు భాను అంగీకరించలేదు. దీంతో మాధవి మనస్తాపానికి గురై తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానంతరం మాధవి వీడియోను అక్క జానకి పరిశీలించింది. దాంతో విషయాలు వెలుగులోకి వచ్చాయి. తల్లి శాంతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చివరగా మాధవి తన తల్లికి రాసిన లేఖ...
"అమ్మా నేను వెళ్లిపోతున్నాను. క్షమించాలి. ఈ బ్రతుకు మీద విసుగుతో నరకం భరించలేక వెళ్లిపోదామని, మెసం చేయడం లేదు. నాకీ బ్రతుకు వద్దు, భాను, నీ జ్ఞాపకాలతో నీకు దూరంగా వెళ్లిపోవాలని, ఈ బరువు దించుకుంటూ సూసైడ్ చేసుకుంటున్నాను, మళ్లీ అవకాశం రాదు, సునీల్ నా చెల్లెలలు ... ఇక లేదు. వెళ్తున్నాను, బ్రతుకు నరకంగా ఉంది". అని రాసి కింద సంతకం పెట్టి శెలవు అని రాసింది.
పోలీసుల అదుపులో భాను తేజ
మాధవి ఆత్మ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాను తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాధవిని మోసం చేసిన భానును మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాధవి ఇంగ్లీష్ లెక్చరర్గా పని చేస్తున్న కళాశాలకు వెళ్లి ఆమె గురించి ఆరా తీయగా..ఆమె చాలా మంచిది, విద్యార్థులకు మంచి మాటలు చెబుతూ, అసలు ఎవరితోనూ గొడవపడే వ్యక్తి కాదని కాలేజీ యాజమాన్యం తెలిపింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న విద్యార్థులు భోరున విలపించారు.