అక్కినేనికి సభ నివాళి: ఊగిపోయిన బాబు, జయకూడా
హైదరాబాద్/చెన్నై: అక్కినేని నాగేశ్వర రావు మృతి పట్ల శాసన సభ ప్రగాఢ సానుభూతి తెలిపింది. భోజన విరామం అనంతరం శాసన సభ ప్రారంభమయ్యాక అక్కినేని మృతి పట్ల శాసన సభ సానుభూతి ప్రకటిస్తున్నట్లు సభాపతి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. చిత్ర పరిశ్రమకు అక్కినేని అందించిన సేవలు అమోఘమన్నారు. దశాబ్దాల సినిమా చరిత్రలో ఎన్నో పాత్రలకు జీవం పోశారన్నారు.
ఆయన 256 చిత్రాల్లో నటించారని, పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య, పద్మభూషణ్, దాదాసాహెబ్ పాల్కె అవార్డులు అందుకున్నారు. మంచి నటుడిగానే కాకుండా సంఘజీవిగా అక్కినేని పలు సేవలు అందించారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తనవంతు సాయం అందించారని, హైదరాబాదులో తెలుగు సినీ పరిశ్రమకు బలమైన పునాదులు వేశారన్నారు. శాసన సభ మౌనం పాటించి నివాళులు అర్పించింది.
చంద్రబాబు ఆవేశం
అక్కినేని నాగేశ్వర రావు అందరికీ స్ఫూర్తిదాయకమైన వారు అని, ఇక్కడ ప్రాంతాలు పక్కన పెట్టి మహనీయులను గుర్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సభలో అన్నారు.
కాగా, సభలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. చంద్రబాబుకు ఆవేశం తన్నుకు వచ్చింది. ఇక్కడ రాజకీయాలు వద్దని సూచించారు. ఓ సమయంలో ఏం తమాషా అనుకుంటున్నారా, సందర్భాన్ని బట్టి నడుచుకోవాలని, ఏం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినారె నివాళి
అక్కినేనికి ప్రముఖ గీత రచయిత సినారె నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1956లో అక్కినేనితో పరిచయం నాటి నుంచి అవిక్షన్నమైన స్నేహబంధంలో ముడిపడి ఉన్నామన్నారు. ఏ సమావేశంలోనైనా పరస్పరం కలిసుండేవారమని తెలియజేశారు. అక్కినేని మనసుకు మడతలు లేవని, ముఖానికి ముడతలు రావు అనే మాటలను ఉదహరించుకోవాలన్నారు.
జయలలిత సంతాపం
అక్కినేని నాగేశ్వర రావు మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత అన్నారు. ఆమె అక్కినేని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.