జగన్ పార్టీ నేత హత్య: విధ్వంసం, పరిటాల శ్రీరాం పేరుతో ఉన్న అంబులెన్స్ ధ్వంసం
అనంతపురం: వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ప్రసాద్ రెడ్డి హత్య తీవ్ర విధ్వంసానికి దారి తీసింది. ప్రసాద్ రెడ్డి మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి, వైసీపీ నేతలు వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రసాద్రెడ్డి మృతదేహం వద్దకు చేరుకున్నారు.
ప్రసాద్ రెడ్డి హత్యతో ఆయన అభిమానులు పట్టణంలో ఆందోళన చేపట్టారు. పరిటాల శ్రీరాం పేరుతో ఉన్న అంబులెన్సును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఫ్లెక్సీలను తగులబెట్టారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
కాగా, అనంతపురం జిల్లా రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ప్రసాద్ రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన మృతుడి బంధువులు, కార్యకర్తలు స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి రికార్డులను దగ్ధం చేశారు.
తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని రెండు ద్విచక్రవాహనాలకు నిప్పు పెట్టారు. పక్కనే ఉన్న ఎంపిడివో కార్యాలయంపై రాళ్ల వర్షం కురిపించారు. జిల్లా ఎస్పీ రాజశేఖర బాబు రంగంలోకి దిగి సర్దిచెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పోలీసు స్టేషన్పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.