విశాఖలో విప్రో ఏర్పాటు, బాబు ఓకే, సోలార్హబ్గా ఏపీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఐటీ సంస్థ ఏర్పాటుకు విప్రో సంస్థ ముందుకు వచ్చిందని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆదివారం చెప్పారు. రూ.500 కోట్ల పెట్టుబడితో 3.1 ఎఖరాలలో ఐటీ సంస్థను ఏర్పాటు చేయనుందని చెప్పారు. ఐటీ సంస్థకు అనుమతించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విప్రో కోరిందని తెలిపారు.
చంద్రబాబు నాయుడు అందుకు అంగీకరించారన్నారు. ఉదయం చంద్రబాబుతో విప్రో చీఫ్ అజీమ్ ప్రేమ్జీ భేటీ అయిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం పల్లె విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ళలో ఏడు వేలమందికి ఉపాధి కల్పించేందుకు విప్రో అంగీకరించిందని తెలిపారు. విప్రో సేవలను విజయవాడ, కాకినాడ, తిరుపతి నగరాలకూ విస్తరిస్తారన్నారు. హిందూపురంలో రూ.500 కోట్లతో సంతూర్ సబ్బుల పరిశ్రమ ఏర్పాటవుతుందన్నారు.
ఏపీలో కంపెనీలకు రాయితీలు ఇస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూపందేరాల పైన విచారణకు ప్రత్యేక కమిటీ పని చేస్తున్నట్లు చెప్పారు. విశాఖలోని విప్రో కంపెనీని సెజ్గా మార్చేందుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.
ఏపీ సోలార్ హబ్గా మారుతుంది: పీయూష్ గోయల్
చంద్రబాబుతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ అ్యారు. అనంతరం పీయూష్ విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుతో రెండుగంటలపాటు వివిధ అంశాలపై చర్చించానని అన్నారు. గడిచిన మూడునెలల్లో ఏపీలో విద్యుత్ కోతలు బాగా తగ్గాయన్నారు. ఆంధ్రప్రదేశ్ త్వరలోనే సోలార్ హబ్గా మారుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన విద్యుత్ సమస్యను పరిష్కరించడానికి త్వరలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆగస్టు 1 నుంచి 2015 మార్చి వరకు ఏపీకి అదనంగా 200 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఈ సెప్టెంబర్ నాటికి 500 మెగావాట్లు, 2015 జనవరి నాటికి మరో 500 మెగావాట్లు విద్యుదుత్పత్తి అందుబాటులోకి రానుందన్నారు.