నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..వారికే పదవులు.. కాంగ్రెస్ డెడ్ లైన్ అప్పటివరకే!
నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారం రోజుల్లో నామినేటెడ్ పోస్టులు మరియు ఇతర పదవులకు అర్హులైన పార్టీ కార్యకర్తల పేర్లతో ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది.
ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్చ
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు హైదరాబాద్లోని గాంధీ భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అన్ని స్థాయిలలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులు మరియు ఇతర ముఖ్యమైన పదవుల భర్తీకి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసేందుకు ఈ చర్చలు జరిగాయి.

వారం రోజుల్లో ప్రతిపాదనలు పంపాలని ఆదేశం
ఈ క్రమంలో అన్ని జిల్లాల ఇన్చార్జి మంత్రులకు నామినేటెడ్ పదవుల భర్తీ పైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులు మరియు ఇతర పదవులకు అర్హులైన కార్యకర్తల పేర్లను వారం రోజుల్లో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఇటీవల ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ అంశం పైన తాను చర్చించినట్టు వెల్లడించారు.
పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు.. వారికే ఆ పోస్టులు
గతంలో కాంగ్రెస్ మండల, జిల్లా కార్యవర్గాలలో, అనుబంధ సంఘాలలో చురుకుగా పనిచేసే, పార్టీ కోసం బాగా కష్టపడిన వారిని, నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకులను ఎంపిక చేయాలని, 60 శాతం నామినేటెడ్ పోస్టులను కేటాయించాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎవరి సిఫార్సులు అవసరం లేకుండా నేరుగా అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
అన్ని జిల్లాల ఇన్చార్జి మంత్రులకు కీలక సూచన
వ్యవసాయ పరపతి సంఘాల డైరెక్టర్లకు, చైర్ పర్సన్ పదవులకు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులకు నిజమైన పార్టీ కార్యకర్తలను గుర్తించాలని ఆయన అన్ని జిల్లాల ఇన్చార్జి మంత్రులకు సూచించారు. ఉమ్మడి జిల్లాలకు ఉన్న ఇన్చార్జి మంత్రులు ఆయా జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిసిసి అధ్యక్షులు, ఆయా నియోజకవర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నాయకులతో నేడు సమావేశం నిర్వహించి ఆశావహుల పేర్లతో నివేదిక రూపొందించాలన్నారు.
వారికి ప్రాధాన్యత ఇవ్వండి.. టీపీసీసీ అధ్యక్షుడి సూచన
తుది జాబితాను సిద్ధం చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఖరారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో రాజకీయ పరిణామాల కంటే పార్టీ కోసం పని చేస్తున్న వారికి, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనివ్వాలని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ఈ విధంగా పార్టీలో పనిచేసిన నాయకులకు గుర్తింపు ఇస్తే, వారు పార్టీని బలోపేతం చేసే ముందుకు తీసుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.













Click it and Unblock the Notifications