రిజర్వేషన్ల బాబుకు కొత్త చిక్కు: పవన్ కళ్యాణ్ మాట్లాడు.. టవరెక్కిన విద్యార్థి
విజయవాడ: ఆర్థికపరమైన రిజర్వేషన్ల పైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందించాలని రవితేజ అనే బిటెక్ విద్యార్థి డిమాండ్ చేశారు. కులాల పరంగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ రవితేజ బుధవారం ఉదయం గుణదలలో సెల్ టవర్ ఎక్కి హంగామా చేశాడు.
కులాల వారిగా రిజర్వేషన్లు వద్దన్నారు. కులాల వారీగా రిజర్వేషన్లు ఇవ్వడంతో ప్రతిభ ఉండి చాలామంది నష్టపోతున్నారని అన్నారు. కులాల పరంగా రిజర్వేషన్ల కారణంగా ఆర్థిక స్థోమత లేని వారు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
రిజర్వేషన్లు కులాలపరంగా కాకుండా ఆర్థికపరంగా ఉండాలన్నారు. ఆర్థికపరమైన రిజర్వేషన్ల పైన పవన్ కళ్యామ్ స్పందించాలన్నారు.
రిజర్వేషన్ల పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశాడు. కాగా రవితేజను సెల్ టవర్ దించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. రవితేజ గన్నవరంలోని ఉమారామా ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు.
కాగా, కాపులకు రిజర్వేషన్లు అంటూ ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష చేయగా, ప్రభుత్వం స్పందించడంతో ఆయన విరమించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాపు రిజర్వేషన్లు పైన బీసీ సంఘాలు చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇప్పుడు కులాల పరంగా రిజర్వేషన్లు వద్దని, ఆర్థికపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కొత్తగా రవితేజ డిమాండ్ చేస్తుండటం.. చంద్రబాబుకు కొత్త తలనొప్పి అని చెప్పవచ్చు.