ఓటమికి హైకమాండ్పై నిందలేసిన బలరాం నాయక్
హైదరాబాద్: మహబూబాబాద్ లోకసభ స్థానంలో తన ఓటమికి మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు నేత బలరాం నాయక్ పార్టీ అధిష్టానంపై నిందలేశారు. శాసనసభ్యుల సీట్ల పంపిణీలో అధిష్టానం పొరపాటు వల్లనే తాను ఓడిపోయానని ఆయన అన్నారు. కాంగ్రెసు ఖమ్మం జిల్లా నేతలు బుధవారంనాడు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కలిశారు.
పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినవారిపై చర్యలు తీసుకోవాలని తాము పిసిసి అధ్యక్షుడిని కలిసినట్లు కాంగ్రెసు నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు. దీంతో శాసనసభ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ఇల్లందు శాసనసభా నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినవారిని ఆరేళ్ల పాటు పొన్నాల లక్ష్మయ్య పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఖమ్మం లోకసభ స్థానంతో పాటు మూడు శాసనసభా స్థానాలను పొత్తులో భాగంగా సిపిఐకి ఇవ్వడం వల్లనే ఖమ్మం జిల్లాలో కాంగ్రెసు అభ్యర్థులు ఓడిపోయారని మాజీ రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీరుపై పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
ప్రతిపక్షమంటే ప్రభుత్వానికి బ్యాండ్ కొట్టడం కాదని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన అన్నారు. ప్రతిపక్షాల నాయకులను చిల్లరగాళ్లు అని అనడం సరైంది కాదని ఆయన అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులను చర్చలకు పిలవాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాని డిమాండ్ చేశారు.