బాలినేని కీలక నిర్ణయం, ఇదే లాస్ట్ - ఇక చేసేది లేదు..!!
వైసీపీ ముఖ్య నేత బాలినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ఇంఛార్జ్ ల మార్పు వేళ బాలినేని కొన్ని సీట్ల విషయంలో పట్టు బట్టారు. ఒంగోలులో ఇంటి స్థలాల విషయంలో నిధుల మంజూరు కోసం ఒత్తిడి చేసారు. అభ్యర్దుల మార్పు సమయంలో బాలినేని ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కొంత విరామం తరువాత ఒంగోలు చేరుకున్న బాలినేని తన నిర్ణయం ప్రకటించారు. అదే సమయంలో మాగుంటకు సీటు విషయంలోనూ కీలక వ్యాఖ్యలు చేసారు.
ఒంగోలుకు బాలినేని: మాజీ మంత్రి బాలినేని పంతం నెగ్గించుకున్నారు. కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న విధంగా ఒంగోలులో పేదలకు ఇంటి స్థలాల విషయంలో నిధులు మంజూరు చేయించుకున్నారు. వైసీపీ ఇంఛార్జ్ ల మార్పు వేళ బాలినేని సీటు మారుతుందనే ప్రచారం సాగింది. గిద్దలూరు నుంచి మాగుంట పోటీ చేస్తారనే వాదన తెర మీదకు వచ్చింది.

అయితే, సీఎంఓ నుంచి వచ్చిన పిలుపు మేరకు సీఎంతో కలిసిన బాలినేని తన నియోజకవర్గంలో పేదలకు ఇంటి స్థలాల కోసం నిధులు మంజూరు చేయించాలని కోరారు. తాను ఒంగోలు నుంచి పోటీ చేస్తానని, ఎంపీగా మాగుంటకు అవకాశం ఇవ్వాలని సూచించారు. మాగుంట విషయంలో సీఎం నుంచి ఎలాంటి హామీ రాలేదని సమాచారం.
స్థలాలకు నిధుల ఖరారు: దీంతో, ప్రభుత్వం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పేదల ఇంటి స్థలాలకు నిధులు మంజూరు చేసింది. ఒంగోలు వచ్చిన బాలినేనికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పేదలకు ఇంటి స్థలాల కోసం ఎన్ అగ్రహారం, వెంగముక్కలపాలెం ప్రాంతాల్లో భూసేకరణ చేస్తున్నామని, దీనికోసం ప్రభుత్వం నుంచి గతంలో రూ.30 కోట్లు మంజూరయ్యాయని, తాజాగా ప్రభుత్వం మరో రూ.180 కోట్లు విడుదల చేసిందని వెల్లడించారు.
ఫిబ్రవరి 10వ తేదీ లోపు పాతిక వేల మంది పేదలకు సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాలు అందజేస్తామని బాలినేని చెప్పారు. ఇక, తనకు ఇవే చివరి ఎన్నికలు అని బాలినేని స్పష్టం చేశారు. ఆ తర్వాత తన కుమారుడు (ప్రణీత్ రెడ్డి) ఎన్నికల బరిలో దిగుతాడని వెల్లడించారు.
ఇవే చివరి ఎన్నికలు: ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో చర్చలు జరుగుతున్నాయని వివరించారు. ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. ఆయనకు ఈసారి వైసీపీ టికెట్ లభించకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. కానీ, బాలినేని మాత్రం మాగుంటకు సీటు కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా గిద్దలూరు సీటు విషయంలో సీఎం జగన్ అభ్యర్దిని సూచించే బాధ్యత బాలినేనికి అప్పగించారు.
ఈ రోజు లేదా రేపు ప్రకాశం జిల్లాలో మార్పులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. బాలినేని వచ్చే ఎన్నికల్లో పోటీ పైన ప్రకటన చేయటంతో ఒంగోలు వైసీపీ శ్రేణుల్లో కొంత కాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెర పడింది. ఇక మాగుంట విషయంలో సీఎం జగన్ తుది నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications