కడప ఎంపీగా పోటీకి వెనుకడుగు : తేలని జమ్మలమడుగు పంచాయితీ : సీయం మాట వింటారా..!
కడప ఎంపీగా పోటీ చేసేందుకు టిడిపి నుండి ఎవరూ ముందుకు రావటం లేదు. జమ్మలమడుగు నేతలు రామసుబ్బారె డ్డి..ఆది నారాయణ రెడ్డిల్లో ఒకరిని లోక్సభకు..మరొకరిని జమ్మలమడుగు అసెంబ్లీ నుండి పోటీ చేయించాలని సీయం భావిస్తున్నారు. అయితే, ఇద్దరూ తమకు అసెంబ్లీ సీటే కావాలని పట్టుబడుతున్నారు. పార్లమెంట్కు పోటీ చేసి ఓడినా ప్రాధాన్యత ఇస్తామని చెప్పినా..అందుకు ససేమిరా అంటున్నారు. ఇక, తానే నిర్ణయం తీసుకుంటానని..దానికి అంగీకరిం చాలని సీయం స్పష్టం చేసారు. మరి..అప్పుడైనా వీరు అంగీకరిస్తారా..
కడప ఎంపీగా పోటీకి వెనుకడుగు..
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కడప జిల్లాలో మెజార్టీ సీట్లు సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. దీని కోసం జిల్లాలో అసెంబ్లీ సీట్ల ఖరారు పై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. వైసిపి నుండి టిడిపి లో చేరి మంత్రి పదవి చేపట్టిన ఆదినారాయణ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జగన్ పై విమర్శలు చేయటం.. వైసిపి నేతల పోల్ మేనేజ్ మెంట్ల మీద అవగాహన ఉండటంతో ఆయన్ను ఈ సారి కడప ఎంపీగా పంపి..రామసుబ్బారెడ్డి ని జమ్మల మడుగు ఎమ్మెల్యేగా దింపాలని తొలుత భావించారు. అయితే, దీని కోసం ఆ ఇద్దిరితోనూ చర్చలు జరిపారు. తన మనసులో మాట బయటపెట్టకుండా మీ ఇద్దరిలో ఒకరు ఎంపిగా..మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ..ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో మీరే నిర్ణయించుకోవాలని సూచించారు. కానీ, వారిద్దరి మధ్య అంగీకారం కుదరలేదు. దీని పై రెండు రోజులుగా ముఖ్యమంత్రి సమక్షంలోనే చర్చలు సాగుతున్నా ఫలితం రాలేదు.
స్థానికంగా ఎమ్మెల్యే సీటు కోసం ఒత్తిడి..
జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎంతో కాలంగా ఆదినారాయణ రెడ్డి- రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య ఫ్యాక్షన్ తగాదాలు ఉన్నాయి. రాజకీయ కారణాలతో ఆదినారాయణ రెడ్డి టిడిపిలో చేరి మంత్రి అయ్యాక..రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మనుషులు ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా..మనసులు మాత్రం కలవటం లేదు. ఇద్దరి అనుచ రులు మాత్రం కలసి పని చేసే పరిస్థితి నియోజకవర్గంలో కనిపించటం లేదు. దీంతో..ఎంపీగా పోటీ చేస్తే నియోజ కవర్గం లో మరొకరి బలం పెరిగిపోతుందని..తాము బలహీనపడతామనే భావన ఇద్దరిలోనూ ఉంది. ఇద్దరి మద్దతు దారులు..కుటుంబ సభ్యులు సైతం ఎంపిగా ససేమిరా వద్దని..జమ్మలమడుగు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని వారిద్దరి పై ఒత్తిడి తెస్తున్నారు. ఇటు ముఖ్యమంత్రి వద్ద తమ నిర్ణయాన్ని ఖరా ఖండిగా చెప్పలేక..తమ వారికి నచ్చ చెప్పలేక ఇద్దరు నేతలు ఎంపిగా పోటీ నుండి ఎలా తప్పుకోవాలా అని ఆలోచన చేస్తున్నారు.
స్వతంత్ర అభ్యర్ధిగా అయినా పోటీ...
ఒక దశలో రామసుబ్బారెడ్డిని ఎంపిగా పోటి చేయమని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తే..పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్ధిగా అయినా బరిలోకి దిగాలని రామసుబ్బారెడ్డి పై అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. అదే విధంగా ఆదినారాయణ రెడ్డి సోదరులు సైతం ఎంపిగా పోటీలో వద్దని..జమ్మలమడుగు నుండే పోటీ చేయాలని చెబుతున్నారు. ఇదే సమయం లో ముఖ్యమంత్రి తానే కడప నేతలతో మాట్లాడి వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటానని..ఎవరు ఎక్కడి నుండి పోటీ చేయాలో చెబుతానంటూనే..ఆ నిర్ణయాన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి ముందు తప్పని స్థితి లో సరే అన్న ఇద్దరు నేతలు..ఎంపీగా పోటీ చేయటానికి మాత్రం సిద్దంగా లేరనే విషయం స్పష్టమవుతోంది. దీంతో.. మరి ముఖ్యమంత్రి వీరిద్దరిలో ఒకరిని ఎంపీగా చేయమని చెప్పినా..ఆ మాటకు వీరు కట్టుబడి ఉంటారా లేదా అనేది సందేహమే. దీంతో..సీయం ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది.