పంచాయతీ ప్రత్యేక అధికారి...పోస్టు కోసం పైరవీలు షురూ!
అమరావతి:పంచాయతీల్లో ప్రత్యేక అధికారి పోస్టు కోసం పలు చోట్ల పైరవీలు షురూ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొందరు పంచాయతీ కార్యదర్శులు, మాజీలుగా మారిన సర్పంచులు పంచాయతీలపై తమ పట్టు సడలిపోకుండా ఉండేందుకు తమకు అనుకూలమైన వాళ్లని తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇందుకోసం నాలుగైదు జిల్లాల్లో భారీగా ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకాడటం లేదని అంటున్నారు. ఇందుకోసం తమ వారి పేర్లను కలెక్టర్లకు సిఫార్సు చేయగలరనుకున్నవారికి ముడుపులు ఇవ్వడానికీ సంసిద్ధమవుతున్నట్లు తెలిసింది. సర్పంచుల పదవీకాలం ముగియడంతో 12,918 పంచాయతీల్లో ఈనెల 2 నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
అధికారుల కొరత కారణంగా పంచాయతీలను క్లస్టర్లుగా విభజించి తహశీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవో), మండల విద్యాశాఖాధికారులు (ఎంఈవో), పీఆర్ఆర్డీ విస్తరణాధికారులతోపాటు అదే హోదా కలిగిన వారిని ప్రత్యేక అధికారులుగా నియమించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు అధికారులు మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారుల నియామకం కోసం కసరత్తు ఆరంభించారు. జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవో) ఈ విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు,ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మాజీ సర్పంచులు కొందరు స్థానిక కార్యదర్శులతో కలిసి అధికారుల నియామకంలో తమ పట్టును,ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
అత్యధిక పంచాయతీల్లో ఇన్నాళ్లూ సర్పంచులు, కార్యదర్శుల హవా నడిచేది. నిధుల ఖర్చు నుంచి వివిధ అనుమతుల్లో వీరిద్దరి నిర్ణయమే కీలకమయ్యేది. కొన్ని చోట్ల సర్పంచులు, కార్యదర్శులు కలిసి వివిధ పనుల్లో సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేకించి ఆర్థిక సంఘ, సాధారణ నిధుల ఖర్చులో వీరిద్దరి నిర్ణయమే అంతిమం. ఈ క్రమంలో 'ప్రత్యేక' పాలనకు ప్రభుత్వం తెరతీయడంతో ఈ దశలోనూ తమ ప్రాభవం దెబ్బతినరాదని అందుకు అనుకూలమైన అధికారుల నియామకం కోసం తెర వెనుక ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఇదిలావుంటే ప్రత్యేక అధికారుల నియామకాల్లో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వం నుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు తెలిసింది. కలెక్టర్లకు పంపే జాబితాల్లోనే జిల్లా పంచాయతీ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా చూడాలి. మరి ఈ కీలక తరుణంలో పంచాయతీ ప్రత్యేక అధికారుల నియామక ప్రక్రియ ఎలా సాగుతుందనేది ప్రాధాన్యత సంతరించుకుంది.