సీఎం జగన్ సొంత జిల్లా కడప... కేక
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బార్ల లైసెన్సుల కోసం బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతానికి అధికారులు జోన్-1, జోన్-4 బిడ్లను తెరిచారు. రాయలసీమలో భారీ మొత్తాలకు బిడ్లు దాఖలవగా తిరుపతిలోని 16 బార్లకు ఆన్ లైన్ ద్వారా వేలం నిర్వహించారు. అత్యధికంగా రూ.1.59 కోట్లు రాగా, అత్యల్పంగా రూ.1.49 కోట్ల ధర పలికింది. అనంతపురంలో ఓ బార్ కోసం రూ.1.09 కోట్లతో బిడ్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలోని 27 బార్లకు ఈవేలం నిర్వహించగా కడప నగరంలోని ఓ బార్ కోసం అత్యధికంగా రూ.1.71 కోట్లు, ప్రొద్దుటూరులోని ఓ బార్ కు రూ.1.30 కోట్ల బిడ్ దాఖలైంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో తక్కువ మొత్తాలకే బిడ్లు దాఖలయ్యాయి. చిన్న చిన్న పట్టణాల్లో కోటిరూపాయలకు పైగా బార్ లైసెన్స్ లు ఉన్నాయి. విశాఖపట్నం మహానగరంలో మాత్రం బార్ గరిష్ట ధర రూ.60 లక్షలే కావడం ఇప్పడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విశాఖలో మొత్తం 128 బార్లకు దరఖాస్తులను ఆహ్వానించారు. 120 బార్లకే దరఖాస్తులు వచ్చాయి. వచ్చినవాటిలో 119 బార్ లైసెన్స్ లకు అధికారులు పచ్చజెండా ఊపారు. రీబిడ్డింగ్, లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలో నూతన బార్ల విధానంలో భాగంగా రాష్ట్రంలో 840 బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ అనుమతులు మంజూరు చేయనుంది. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 2025 ఆగస్టు 31వ తేదీ వరకు మూడు సంవత్సరాలకు అనుమతులు మంజూరు చేయబోతున్నారు.
ప్రస్తుతం వైన్ షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. వీటిని కూడా త్వరలోనే వేలంపాటద్వారా ప్రయివేటు వ్యక్తులకే అప్పజెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వమే సొంతంగా నడపడంవల్ల ఇబ్బందులు ఎదురవడంతోపాటు ఆదాయం అనుకున్నరీతిలో రావడంలేదని తెలుస్తోంది. వేలంద్వారా నిర్వహిస్తే అనుకున్నదాన్ని మించి వచ్చే అవకాశం ఉందని ప్రభత్వ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.