తిరుమల ఘాట్లపై టీటీడీ కొత్త నిర్ణయం
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు 70,610 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 17,310 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.78 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లల్లో వేచివుండనక్కర్లేదు. భక్తులు నేరుగా క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్లొచ్చు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 7 నుంచి 9 గంటల సమయం పట్టింది. క్యూలైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుమల ఘాట్ రోడ్లపై టీటీడీ అధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. సుందరీకరణకు సంబంధించిన పనులను మొదలు పెట్టారు. ఈ క్రమంలో తిరుమల- తిరుపతి మొదటి ఘాట్ రోడ్డులో హై ఫోకస్డ్ ల్యాంప్స్ను ఏర్పాటు చేశారు. దీనివల్ల రాత్రివేళ తిరుమలగిరులు మరింత శోభాయమానంగా కనిపిస్తాయి.
తిరుమల నుండి తిరుపతికి ప్రయాణించే మొదటి ఘాట్ రోడ్లోని చివర్లో ఉన్న గరుడాద్రి పర్వత శ్రేణులు వద్ద హై ఫోకస్డ్ లాంప్స్ను టీటీడీ విద్యుత్ విభాగం ఏర్పాటు చేసింది. గతంలోనూ ఈ ఏర్పాటు ఉన్నప్పటికీ- కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో ఇది పూర్తిస్థాయిలో అమలు కాలేదు.
తాజాగా- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దీన్ని పునరుద్ధరించడానికి చొరవ తీసుకున్నారు. ఫలితంగా- రాత్రివేళ స్వర్ణ కాంతులీనుతూ కనువిందు చేస్తోన్నాయి తిరుమలగిరులు. ట్రయిల్ రన్లో భాగంగా మొదటిదశలో ఆరు ఫోకస్ లైట్లను వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications