బెంగళూరు యువకుడ్ని హత్య చేసి పూడ్చి పెట్టారు: రెండు నెలలకు వెలుగు చూసిన వైనం
చిత్తూరు: చిత్తూరు జిల్లా రామసముద్రం ఆర్ నడింపల్లి సమీపంలో ఓ వ్యక్తిని హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టారు. ఈ సంఘటన రెండు నెలల తర్వాత శుక్రవారంనాడు వెలుగు చూసింది. బెంగళూరులోని తాడ అగ్రహారానికి చెందిన తిరుమలప్ప (25) అనే యువకుడు 2 నెలల నుంచి కనిపించడం లేదు.
దాంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అక్కడి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా పట్టుబడిన నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దాంతో హత్య చేసిన విషయాన్ని వారు చెప్పారు. తిరుమలప్పను పూడ్చి పెట్టిన స్థలానికి వారిని పోలీసులు తీసుకుని వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు.
ఆస్తి కోసం తండ్రి హత్య
గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఓ వ్యక్తి తన తండ్రిని ఆస్తి కోసం హత్య చేశాడు. ఆస్తి తగాదాలో కుమారుడు తండ్రిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
నరసరావుపేట మండలం కాకాని గ్రామానికి చెందిన జొన్నలగడ్డ కృపారావు (70) కొంత కాలం క్రితం 20 సెంట్ల భూమిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ భూమిని తన పేర రాయించుకునేందుకు కృపారావు కొడుకు ఏలియా పథకం వేశాడు. తల్లి సోమమ్మకు మాయమాటలు చెప్పి భూమిని తన పేరు మీద రిజిష్టర్ చేయించుకున్నాడు.
పాసు పుస్తకాలో కోసం వీఆర్వోను సంప్రదించగా విషయం తల్లికి తెలిసింది. అప్పటి నుంచి తల్లిదండ్రులకు, కుమారుడికి మధ్య తగాదా చోటు చేసుకుంది. పెద్దలు ఇరువురికీ రాజీ చేసి 50 సెట్ల భూమిని తల్లికి ఇచ్చే విధంగా ఒప్పించారు. ఈ నెల 5వ తేదీన మరోసారి తల్లికి, కుమారుడికి మధ్య గొడవ జరిగింది.
ఆ సమయంలో మంచంపై ఉన్న తండ్రి మీద ఏలియా తన్నాడు. దీంతో తండ్రి కృపారావు ఆస్వస్థతకు గుర్యయాడు. దాంతో ఆయనను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను శుక్రవారం మధ్యాహ్నం మరణించాడు.