మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్..! కొంపముంచిన ఆ ఫిర్యాదు వెనక్కి?
కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో ఇవాళ రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి ఆమె దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారు. ఆమె తనపై నమోదైన పాత ఫిర్యాదు గురించి అఫిడవిట్ లో పేర్కొనకపోవడంపై బీజేపీ ఇచ్చిన ఫిర్యాదును ఆంగీకరించి రాజ్యసభ నామినేషన్ తిరస్కరించారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు కూడా జోక్యానికి నిరాకరించింది. మరోవైపు ఆమెపై నమోదైన పాత ఫిర్యాదుపై హైదరాబాద్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థిత్వం తిరస్కరణకు దారితీసిన ఫిర్యాదును హైదరాబాద్లోని స్థానిక కోర్టు వెనక్కి పంపింది. ఆ ఫిర్యాదులో నిందితులుగా పేర్కొన్న వ్యక్తులు మాజీ లేదా ప్రస్తుత ప్రజాప్రతినిధులు కావడంతో, తమ అధికార పరిధి కాదని చెప్పి తిప్పి పంపింది. ఈ కారణంతో నాంపల్లిలోని నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆ ఫిర్యాదును వెనక్కి పంపారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు గురైంది.

రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ మీనాక్షి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ రోజు కొట్టివేసింది. దీనికి సరైన పరిష్కారం 'ఎలక్షన్ పిటిషన్' (ఎన్నికల వివాదానికి సంబంధించిన పిటిషన్) దాఖలు చేయడమేనని కోర్టు పేర్కొంది. కుంభం శివ కుమార్ రెడ్డి తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ ఒక మహిళ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. తెలంగాణకు సంబంధించి ఏఐసీసీ ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలో, లైంగిక వేధింపుల ఫిర్యాదుపై మీనాక్షి ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేదన్న ఆరోపణతో ఆమెను కూడా ఈ కేసులో నిందితురాలిగా చేర్చారు. కానీ ఆ కేసులో ఆమెకు నిందితురాలిగా చేర్చినట్లు తెలియక అఫిడవిట్ లో వివరాలు ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications