టీమ్ టీడీపీకి ఆఖరి పోరాటం.. దేవుడికి ఒకేసారి ఇన్ని కష్టాలా?.. కమాన్ చంద్రబాబూ..
ప్రజల చీత్కారానికితోడు గతంలో చంద్రబాబు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటం.. తాజాగా యెస్ బ్యాంకు కుంభకోణంలోనూ ఆయన పేరు ప్రముఖంగా వినబడటంలాంటి పరిణామాలు ఆయన భక్తులకు మిగుడుపడటంలేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరుపొందిన టీడీపీ చీఫ్ కు ఆయన భజన బృందానికి ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలే ఆఖరి పోరాటమని ఎద్దేవా చేశారు. మంగళవారం ఈమేరకు వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారాయన.

స్వాగతమా? పలాయనమా?
స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచుతూ అభ్యర్థులు పట్టుపడితే గెలిచిన తర్వాత కూడా పదవులు పీకేస్తామంటూ వైసీపీ సర్కారు తీసుకొచ్చిన కొత్త చట్టంపై టీడీపీ వరుస వరుమర్శలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి చంద్రబాబుకు సవాలు విసిరారు. ‘‘సీఎం జగన్ అత్యంత సాహసంతో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఇప్పటిదాకా కొనసాగిన ప్రలోభాలపర్వానికి ముగింపు పలికి, తమ పరిణితి చాటుకునేందుకు రాష్ట్ర ప్రజానీకం కూడా తహతహలాడుతోంది. కమాన్ చంద్రబాబూ.. ఈ శుభపరిణామాన్ని స్వాగతిస్తావో లేక పలాయనం చిత్తగిస్తావో తేల్చుకోవాల్సింది నువ్వే''అని రాసుకొచ్చారు.

మందు మీది.. మాట మాకా?
ఎన్నికల సంస్కరణల్ని వ్యతిరేకిస్తోన్న చంద్రబాబు.. రాబోయే కొద్ది రోజుల్లో తానే డబ్బు, మద్యం పంపిణీ చేయించడానికి సిద్ధంగా ఉన్నాడని, ఆ నేరాన్ని మాత్రం వైసీపీ మీదికి నెట్టేసే కుట్రలు చేస్తున్నాడని విజయసాయి ఆరోపించారు. ‘‘చంద్రబాబు పచ్చ ముఠాకు ఈ ఎన్నికలే ఆఖరిపోరాటం. కాబట్టి వైసీపీ సైనికులు అప్రమత్తంగా ఉండాలి. సీఎం జగన్ పై బురదజల్లడానికి చంద్రబాబు టీమ్ ఎంతకైనా తెగిస్తుంది. ఎల్లో మీడియా గోతికాడ నక్కలాగా ఎదురుచూస్తోంది''అని సొంతపార్టీ కార్యకర్తల్ని హెచ్చరించారు.

అయ్యో హతవిధీ..
దేశంలో ఏమూల ఏ కుంభకోణం బయటపడినా దానితో చంద్రబాబుకు లింకులు ఉంటాయని, తాజాగా వెలుగుచూసిన యెస్ బ్యాంకు స్కాంలో టీడీపీ అధినేత పాత్ర తొందర్లోనే బహిర్గతమవుతుందని విజయసాయి చెప్పారు. ‘‘యెస్ బ్యాంకు స్కాంకు సంబంధించి రాణా కపూర్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. తద్వారా అక్రమ లావాదేవీల గుట్లన్నీ అధికారుల చేతికి చిక్కాయి. దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపితే చంద్రబాబుకు ఎంత డబ్బు ముట్టిందో కచ్చితంగా బయటపడుతుంది. తమ దేవుడు చంద్రబాబుకు ఒకేసారి ఇన్ని కష్టాలు వచ్చిపడ్డాయేమిటాని ఎల్లో మీడియా విలవిలలాడిపోతోంది..''అంటూ వైసీపీ ఎంపీ మండిపడ్డారు.

కీలక తేదీలివే..
ఏపీలో మూడంచెల స్థానిక సంస్థలకు వరుసగా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 21న ఎంపీటీసీ, జెడ్పీటీపీ ఎన్నికలు, 23న మున్సిపాలిటీ ఎన్నికలు, 27,29 తేదీల్లో రెండు విడతల్లో పంచాయితీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఫలితాల విషయానికొస్తే.. 24న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, 27న మున్సిపల్, 27,29 తేదీల్లో పంచాయితీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.












Click it and Unblock the Notifications