భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించే ప్లాన్!
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. అంతేకాదు ఈ ప్రారంభోత్సవం నాడే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నమోదుకు కూడా భారీ ప్లాన్ చేసింది.
ఈ నృత్యం దేశంలోనే అతిపెద్ద దింసా ప్రదర్శన
ఆగస్ట్ 1వ తేదీన భారత ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా 13వేల మంది గిరిజన కళాకారులు, బాలికలు, మహిళలతో భారీ థింసా నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నృత్యం దేశంలోనే అతిపెద్ద దింసా ప్రదర్శనగా నమోదు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కాలని ప్రయత్నం చేస్తున్నారు.

వేల సంఖ్యలో మహిళలు, బాలికలతో దింసా ప్రదర్శన
అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి 6 వేలమంది, పార్వతీపురం మన్యం జిల్లా నుండి 5వేల మంది, పోలవరం జిల్లా నుండి 2వేల మంది బాలికలు, మహిళలు ఈ దింసా నృత్య ప్రదర్శన చేయనున్నారు. ఇది సాధారణంగా 15 నుండి 20 మంది సమూహాలుగా ఏర్పడి చేసే సాంప్రదాయ గిరిజన నృత్యం.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించాలని ప్రయత్నం
ఈ నృత్యాన్ని వేలాదిమంది ఏకకాలంలో సింక్రనైజ్ద్ స్టెప్స్ తో ప్రదర్శించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించాలని ప్రయత్నం చేయనున్నారు. ప్రధానమంత్రి విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ఈ భారీ బృందం తమ నృత్యంతో ప్రధానికి స్వాగతం పలకనుంది. గిరిజనులు తమ సాంప్రదాయమైన చీరలు, ఆభరణాలతో అలంకరించుకుని, మోరి, తుడుం, డప్పు వంటి సాంప్రదాయ వాయిద్యాల సహకారంతో రౌండ్ గా తిరుగుతూ నృత్యం చేస్తారు.
ఉత్తరాంధ్ర గిరిజన సంప్రదాయాలను ప్రపంచ వేదికపై చాటి చెప్పే ప్రయత్నం
ఈ ప్రదర్శన గిరిజన సంస్కృతి, సామూహిక ఐక్యత, ప్రకృతితో వారికున్న సాన్నిహిత్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఉత్తరాంధ్ర గిరిజన సంప్రదాయాలను ప్రపంచ వేదికపై చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా విమానాశ్రయ ప్రారంభోత్సవం రోజు చేయనున్న ఈ ప్రయత్నం భోగాపురం విమానాశ్రయం గురించి ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది.












Click it and Unblock the Notifications